Andhra PradeshHome Page SliderPolitics

అబ‌ద్ధానికి ప్యాంటు, ష‌ర్టు వేస్తే అది జ‌గ‌న్ రెడ్డిలా ఉంటుంది..

Share with

-సైకో పాల‌న పోవాలి-సైకిల్ ప్ర‌భుత్వం రావాలి

-టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్

అబ‌ద్ధానికి ఫ్యాంటూ ష‌ర్టూ వేస్తే జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిలా ఉంటుంద‌ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సీఎం తీరుపై మండిప‌డ్డారు. మంగ‌ళ‌గిరి మున్సిప‌ల్ మాజీ చైర్మ‌న్ కాండ్రు శ్రీనివాసరావు తో పాటు న్యాయ‌వాది కొమ్మారెడ్డి వీర‌రాఘ‌వ‌రెడ్డి, రిటైర్డ్ ప్ర‌భుత్వ‌ ఉద్యోగులు నూత‌ల‌పాటి నంబూద్రిపాద్..తిరువీధుల న‌ర‌సింహమూర్తి పార్టీలో చేరిన సంద‌ర్భంగా జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ఆయ‌న మాట్లాడారు. బుధ‌వారం ఈద్గా ఫంక్షన్ హాల్లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో టిడిపి కండువాలు కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సంద‌ర్భంగా లోకేష్ మాట్లాడుతూ  దేశానికి అభివృద్ది, సంక్షేమం పరిచయం చేసిన వ్యక్తి స్వర్గీయ ఎన్టీఆర్ అని కొనియాడారు.  సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అని న‌మ్మి తెలుగుదేశం పార్టీని ఆరంభించార‌న్నారు. మహిళలకు ఆస్తి హక్కు, బిసిలకు 34 శాతం రాజకీయ రిజర్వేషన్లు క‌ల్పించిన మ‌హానాయకుడు ఎన్టీఆర్ తెలుగుజాతి కీర్తి కిరీటం అని పేర్కొన్నారు. తెలుగువారిని మద్రాసీలు అనేవార‌ని టిడిపి ఆవిర్భావం తరువాత తెలుగు ప్రజలకు గుర్తింపు తెచ్చిన ఘ‌న‌త వ‌హించిన‌ ఎన్టీఆర్ వారసునిగా ఈ రోజు తెలుగుదేశం పార్టీలో భాగస్వామిని కావ‌డం త‌న అదృష్ట‌మ‌న్నారు. తాత ఎన్టీఆర్ అంత మంచి పేరు తెచ్చుకోలేకపోవచ్చు కానీ ఆయనకు చెడ్డపేరు మాత్రం తీసుకురానన్నారు.  తెలుగుదేశం పార్టీలోకి కాండ్రు శ్రీనివాసరావుకు హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాన‌న్నారు.  మునిసిపల్ చైర్మన్ గా మంగళగిరి పట్టణాన్ని శ్రీనివాసరావు ఎంతో అభివృద్ది చేశార‌న్నారు. వివాదాలకు దూరంగా ఉండి…ప్రజల కష్టాల్లో పాలుపంచుకునే కాండ్రు శ్రీనివాసరావుకి పార్టీలో త‌గిన గుర్తింపునిస్తామ‌ని హామీ ఇచ్చారు. కాండ్రు శ్రీనివాస‌రావు వై.ఎస్.ఆర్ మనిషి అని, జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత శ్రీనివాస‌రావులాగే వైఎస్ అభిమానులు అంద‌రినీ వైసీపీ నుంచి త‌రిమేస్తున్నార‌ని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలు, నాయకులను గౌరవంగా పలకరిస్తామ‌ని, ఒక కార్యకర్తకు ఇబ్బంది వస్తే పార్టీ మొత్తం అండగా నిలిచే పార్టీ టిడిపి అని పేర్కొన్నారు. విద్య, వైద్యం, స్వయం ఉపాధి వంటి రంగాల్లో టిడిపి క్యాడర్ కు అండగా పార్టీ నిలుస్తోంద‌న్నారు. కష్టపడి సిఎంను చేసిన వైసీపీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల‌కు జ‌గ‌న్ చేసిన  ఒక్క మేలూ లేద‌న్నారు. పార్టీలో సీనియర్లను, జూనియర్లను గౌరవిస్తాన‌ని, పని చేసే వారిని ప్రోత్సహిస్తాన‌ని అన్నారు.  

అబద్దానికి ప్యాంట్ షర్ట్ వేస్తే అది జగన్ రెడ్డిలా ఉంటుంద‌ని, నోరు తెరిస్తే అబద్దాలు ఆడుతున్నాడు కాబట్టి అబద్దాల రెడ్డి అని జ‌గ‌న్ కి పేరు పెట్టాన‌న్నారు. జగన్ చెప్పిన మద్యపాన నిషేధం అబద్దం, రూ.3 వేల పెన్షన్ అబద్దం, జాబ్ క్యాలెండర్ అబద్దం, ప్రత్యేక హోదా అబద్దం, మూడు ముక్కల రాజధాని అబద్దం…ఇలా జ‌గ‌న్ చెప్పేవ‌న్నీ అబద్దాలేన‌న్నారు. జగన్ సంక్షేమం ప‌థ‌కాలు పెంచుతూ పోతాన‌ని హామీ ఇచ్చి… కరెంట్, ఆర్టీసి చార్జీలు, ఇంటి, నీటి, చెత్త పన్నులు, పెట్రోల్ డీజిల్‌, నిత్యావసరాల‌ ధరలు పెంచాడ‌ని ఆరోపించారు. చివరికి మద్యం ధరలు కూడా పెంచేశాడ‌ని ఎద్దేవా చేశారు.  మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే నటన, వేషాలు చూసి క‌ర‌క‌ట్ట క‌మ‌ల్ హాస‌న్ అని పేరు పెట్టామ‌న్నారు. ఆర్.ఆర్.ఆర్ సినిమా ఆస్కార్ అవార్డు కోసం వెళ్లింది కానీ మన కరకట్ట కమల్ హాసన్ ను పంపితే ఖచ్చితంగా ఆస్కార్ వస్తుంద‌ని ఎమ్మెల్యే ఆర్కే అతి వేషాల గురించి వివ‌రించారు.  బ‌ర్రెలు, గొర్రెలతో ఫోటోలు దిగే ఎమ్మెల్యే నియోజ‌క‌వ‌ర్గంలో పెన్షన్ లు తొలగించిన 5 వేల మందితో ఫోటోలు దిగాల‌ని సూచించారు. మంగళ‌గిరి నియోజకవర్గానికి వివిధ బ‌డ్జెట్ల‌లో సీఎం జ‌గ‌న్ రెడ్డి ఇస్తున్న‌ట్టు ప్ర‌క‌టించిన రూ.2600 కోట్లలో ఒక్క రూపాయి అయినా ఖ‌ర్చు చేశారా అని ఎమ్మెల్యేని నిల‌దీశారు. నేను వస్తే ఇళ్లు పడగొడతాన‌ని ప్ర‌చారం చేసిన క‌ర‌క‌ట్ట క‌మ‌ల్ ప్ర‌తీ ఊరిలో ఇళ్లు ఎందుకు కూల‌గొడుతున్నారో స‌మాధానం చెప్పాల‌న్నారు. నియోజవర్గంలో అక్రమంగా గ్రావెల్ తవ్వుతూ ఎన్ని కోట్లు కొల్ల‌గొట్టారో ఎమ్మెల్యే వెల్ల‌డించాల‌న్నారు.

ఓడిపోయినా నియోజకవర్గాన్ని వదిలి పెట్టలేద‌ని, 13 సంక్షేమ పథకాలు అమ‌లు చేస్తున్నాన‌ని చెప్పారు.  అన్నా క్యాంటీన్లతో ఆక‌లి తీర్చాన‌ని, ఎన్టీఆర్ సంజీవని పేరుతో ప్ర‌జ‌ల‌కు వైద్యం అందిస్తున్నామ‌ని, స్త్రీ శక్తి  ప‌థ‌కం కింద మహిళలకు శిక్ష‌ణ ఇచ్చి ఉపాధి క‌ల్పించామ‌ని, యువ కార్య‌క్ర‌మంలో భాగంగా యువతకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇప్పిస్తున్నామ‌ని తెలిపారు. స్వర్ణకారుల కోసం సొసైటీ ఏర్పాటుచేసి సంక్షేమానికి పాటుప‌డుతున్నామ‌న్నారు. నిరుపేద కుటుంబాలకు తోపుడు బండ్లు, గ్రామాల్లో పెళ్లిళ్లు జరిగితే పెళ్లి కానుక ఇస్తున్నామ‌న్నారు. గ్రామాల్లో రోడ్లు లేవంటే రోడ్లు వేయిస్తున్నాన‌ని చెప్పారు. పురోహితులు, పాస్టర్లు, ఇమాం, మౌజాంలకు సాయం చేస్తున్నామ‌న్నారు. కోవిడ్ సమయంలో మంగళగిరి ప్రజలకు టెలిమెడిసిన్ ద్వారా సేవ‌లు అందించామ‌ని తెలిపారు. తాగునీటి సమస్య పరిష్కారం కోసం ఉచితంగా తాగునీటి ట్యాంకర్లను ఏర్పాటు చేశామ‌న్నారు. క్రీడ‌ల‌ను ప్రోత్స‌హించేందుకు యువత కోసం మంగళగిరి ప్రీమియర్ లీగ్ నిర్వ‌హించామ‌న్నారు. ఓడిపోయి, పార్టీ ప్రతిపక్షంలో ఉంటే ఈ స్థాయిలో సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న నేను గెలిచి..టిడిపి అధికారంలోకి వ‌స్తే మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధి ఒక స్థాయిలో ఉంటుంద‌న్నారు.  కరకట్ట కమల్ హాసన్ లా నటన రాదు. ఉన్నది ఉన్నట్లు చెపుతాను…చేస్తాన‌న్నారు.  టిడిపి అధికారంలోకి వ‌స్తే మంగళగిరి నియోజకవర్గంలో మూడేళ్లలో 10 వేల ఇళ్లు కట్టి ఇస్తామన్నారు. ఇంటి ప‌ట్టాల స‌మ‌స్య ప‌రిష్క‌రిస్తాన‌ని, అట‌వీ భూముల్లో ఉన్న వారికి మాత్రం పట్టాలు ఇవ్వడానికి కొంత సమయం పడుతుంద‌న్నారు. మనం జగన్ రెడ్డిలా పరదాలు కట్టుకుని తిరగలేమ‌న్నారు. చంద్ర‌బాబుని సొంత నియోజ‌క‌వ‌ర్గంలో అడుగుపెట్ట‌కుండా అడ్డుకున్నార‌ని, తన‌పై  13కి పైగా కేసులు పెట్టార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. 

పేదల పెన్షన్ లు తీసేసి దాన్ని గొప్పగా చెప్పుకుంటున్న వ్యక్తి జగన్ రెడ్డి అని, అందుకే ఈ సైకో పాలన పోవాలి….సైకిల్ పాలన రావాలి అని పిలుపునిచ్చారు.  జనవరి 27 నుంచి  400 రోజుల పాటు 4 వేల కిలో మీటర్లు యువగళం పేరుతో రాష్ట్రంలో పాదయాత్ర కు వెళుతున్నాన‌న్నారు. ఈ సమయంలో మంగళగిరి ప్రజలకు మాత్రం కొంచెం దూరం అవుతాను అనే బాధ ఉన్నా..ప్ర‌జ‌లంద‌రినీ క‌లిసి వారి బాగోగులు తెలుసుకునే అవ‌కాశం ఉంద‌న్నారు. నే ను ఎక్కడ ఉన్నా నా మనసు మంగళగిరిపైనే ఉంటుంద‌ని, ఎవ‌రికి ఏ సాయం కావాల‌న్నా వారికి అందుతుంద‌ని భ‌రోసా ఇచ్చారు.  39 సంవత్సరాలు నన్ను ఆశీర్వదించండి..దీవించండి, వచ్చే ఎన్నికల్లో నన్ను గెలిపించండి, రాష్ట్రం మొత్తం మంగళగిరి వైపు చూసేలా చేస్తాన‌ని హామీ ఇచ్చారు.