ఒకే ఓటరుకు రెండు రాష్ట్రాలలో ఇక ఓట్లు లేనట్లేనా…
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విడిపోయాక ఆంధ్రులకు రెండుచోట్ల ఓట్లు దర్శనమిస్తున్నాయి. ఇక మీదట ఇది కుదరదని ఎన్నికల కమిషన్ తేల్చిచెప్పింది. పదులు, వందల సంఖ్యలో కాదు, లక్షల సంఖ్యలో ప్రజలకు ఓట్లున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరలో ఉండడం, ఆంధ్ర ప్రదేశ్ సెటిలర్లకు తెలంగాణలో ఓట్లు ఉండడం ప్రమాదమని వైసీపీ పార్టీ ఆరోపిస్తోంది. ఈ విషయంపై ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్తామంటున్నారు. సీమాంద్ర ప్రజలు తెలంగాణ ఎన్నికలను కూడా శాసిస్తున్నారు. లక్షల మంది ఓటర్లు ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చిన వారు ఉండడంతో ఎక్కువ ప్రమాదం వైసీపీకే. ఎందుకంటే చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కంటే హైదరాబాద్, బెంగళూరు, ఇతర దేశాలలో కూడా ర్యాలీలు, సభలు జరిగాయి. ఇవన్నీ టీడీపీ ఓట్లేనని, వారికి ఆంధ్రప్రదేశ్లో ఓట్లు ఉంటే కుదరదని వైసీపీ వాదన. అంతేకాదు, వారు సొంతూళ్లకు వచ్చి ఇక్కడా ఓటు వేస్తారు. ఉద్యోగం చేసే చోట కూడా ఓట్లు వేస్తారు. రెండు రాష్ట్రాలలో వేరు వేరు సమయాలలో ఎలక్షన్లు జరగడం కూడా వీరికి కలిసి వచ్చే అంశమే. దీనితో ఈ ఓట్లు తొలగించాలని విజ్ఞప్తి చేసింది. ఈ సమాచారం అంతా ప్రభుత్వ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ముందే సేకరించింది వైసీపీ. దీనితో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ముందే ఈ ఓట్లను సరిచేయాలని, ఒక వ్యక్తికి ఒకచోటే ఓటు ఉండేలా చూడాలని ఎన్నికల కమిషన్ను అభ్యర్థిస్తోంది.