హౌసింగ్లో 1000 కోట్ల నిధులు దుర్వినియోగంపై ఏం సమాధానం చెబుతారు?.. ఎస్.విష్ణువర్ధనరెడ్డి డిమాండ్
ఏపీలో వైసీపీ పాలనలో నాలుగేళ్లుగా నిధుల దుర్వినియోగం జరుగుతోందని ఆరోపణలు చేస్తున్నారు బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎస్. విష్ణువర్ధనరెడ్డి. హౌసింగ్లో 1000 కోట్ల నిధుల దుర్వినియోగం జరిగిందని, దీనిపై ఏం సమాధానం చెపుతారని వ్యాఖ్యానించారు విష్ణువర్థన్ రెడ్డి. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఎస్.విష్ణువర్ధనరెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురందేశ్వరిగారు అడిగిన ప్రళ్నలకు భయపడి, సమాధానం చెప్పలేని వైకాపా నేతలు మంత్రులు వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారని మండిపడ్డారు. నిజాయితీ ఉంటే 4 ఏళ్ల వైకాపా పాలనపై భాజపా వేస్తున్న 9 ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

1). బాలల అక్రమ రవాణా విషయంలో దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంద్రప్రదేశ్ 3 వ స్ధానంలో ఉంది. ఈ వైఫల్యానికి మీ సమాధానం ఏంటి?
2). తలసరి ఆదాయంలో దక్షిణాధిరాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ ఎందుకు వెనుకబడింది. వ్యవసాయం, ఆక్వా, ఉద్యానరంగం ఎంతో అభివృద్ధి చెందిన రాష్ట్రంలో ఎందుకు తలసరి ఆదాయం పెరగలేదు ?
3). జలజీవన్ మిషన్ పథకాన్ని రాష్ట్రంలో ఎందుకు వినియోగించుకోలేదు? ఈ పథకానికి అయ్యే ఖర్చులో కేంద్రం ఇచ్చే ఆర్ధిక సహాయాన్ని ఎందుకు ఉపయోగించుకోలేదు? ఎందుకు ప్రజలకు మంచినీటిని అందించలేకపోయారు?
4). కేంద్ర ప్రభుత్వం పేదల కోసం కేటాయించిన 25 లక్షల ఇళ్లను ఎందుకు నిర్మించి ఇవ్వలేకపోయారు? ఇళ్ల స్థలాల్లో వచ్చే కమిషన్ కోసం 30 లక్షల ఇళ్ల స్థలాలను సేకరించారు. ఇళ్లు నిర్మిస్తే కమిషన్ కాదు కాబట్టి ఆ పనిచేయలేదా?
5). రాష్ట్రంలో పేదలకు అందించే వైద్య సదుపాయాల విషయంలో ఎందుకు విఫలమయ్యారు? పట్టణ, గ్రామీణ వైద్య, ఆరోగ్యకేంద్రాలు, జిల్లా ఆసుపత్రులు, జనరల్ ఆసుపత్రుల్లో ఎందుకు వైద్య సదుపాయాలు అందుబాటులో లేవు ? వైద్య పరీక్షలు అందుబాటులో లేవు? మందులు ఎందుకు ఇవ్వడం లేదు? వైద్యులు, వైద్య సిబ్బంది ఖాళీలు ఎందుకు భర్తీ చేయడం లేదు?
6). ప్యానల్లో ఉన్న 80 శాతం కార్పొరేట్ ఆసుపత్రులు ఎందుకు ఆరోగ్యశ్రీ పథకంలో వైద్యం చేయడం లేదు? వారికి బకాయిలు ఎందుకు చెల్లించడం లేదు?
7). ఉన్నత విద్యను ఎందుకు నిర్లక్ష్యం చేశారు? పీజీ విద్యార్థులకు ఎందుకు ఉపకారవేతనాలు దూరం చేశారు. డిగ్రీలో తెలుగును రద్దుచేశారు. ఆంగ్లభాషకే ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు.
8). ప్రభుత్వోద్యోగాలను ఎందుకు భర్తీ చేయలేదు? వర్శిటీల్లో ఉపన్యాసకులు, కళాశాలల్లో లెక్చరర్లను, పాఠశాలల్లో టీచర్లను ఎందుకు భర్తీచేయలేదు? ఖాళీగా ఉన్న 2.50 లక్షల బాక్లాగ్ పోస్టులను ఎందుకు భర్తీ చేయలేదు?
9). రాష్ట్రంలో ఛిద్రమైన రహదారులను ఉందుకు పునర్నిర్మించట్లేదు? సీఎం జగన్, ఆయన మంత్రులు కారుయాత్ర చేస్తే రోడ్ల పరిస్థితి తెలుస్తుందని ఎద్దేవా చేశారు.

పురంధేశ్వరిని విమర్శించే మంత్రులు ముందుగా ఆయా శాఖలకు ఏం పనులు చేశారో, ఎంత వరకు అభివృద్ధి చేశారో చెప్పాలి? విజయసాయిరెడ్డి విశాఖను ఏం అభివృద్ధి చేశారు.? రోజా పర్యాటక శాఖ అభివృద్ధికి ఏం చేశారు? గుడివాడ అమర్నాధ్ ఎన్ని కొత్త పరిశ్రమలు తెచ్చారు? ఎంత మందికి ఉపాధి కల్పించారు? కోళ్ల గురించి ఎక్కువ అవగాహన ఉన్న అమర్నాధ్ కోళ్ల పరిశ్రమ పెట్టుకోవాలి. బొత్స సత్యనారాయణ ఎంత మంది పీజీ విద్యార్థులకు ఉపకారవేతనాలు ఇచ్చారు? 4 ఏళ్లలో డిఎస్సి ద్వారా ఎందుకు భర్తీ చేయలేదు? విడదల రజని వైద్యఆరోగ్య వ్యవస్థను ఎంతగా బలోపేతం చేశారో చెప్పాలి. ఎయిమ్స్కు కనీసం నీటిని అందించలేకపోయారని విమర్శలు కురిపించారు. కేవలం కేంద్రప్రభుత్వ నిధులతోనే రాష్ట్రం నడుస్తోందని, ఏ విధమైన ఆదాయ మార్గాలు ఏర్పాటు చేయలేదని విమర్శించారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా ఏటా ఇచ్చే రూ.400 కోట్ల నిధులతో ఒక్కో మనిషికి రూ.5 లక్షల విలువైన వద్య సదుపాయం లభిస్తుంటే ఎందుకు దాని గురించి మాట్లాడరు? వైద్యకేంద్రాలు, పంచాయతీ భవనాలు, స్కూలు భవనాలు, ఆర్బీహెచ్లు, రహదారులు, పర్యాటక కేంద్రాలకు కేంద్రం ఇచ్చే నిధులతో తప్ప రాష్ట్రంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరగలేదు.ఈ 9 ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. 9 మంది లేదా 90 మందిని లేదా కట్టుకుని రండి. ఎక్కడి వస్తారో చెప్పండి. ఎప్పుడైనా చర్చకు సిద్దంగా ఉన్నాం అంటూ సవాల్ చేశారు. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పకుంటే ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటాం. దిగుజారుడు వ్యాఖ్యలు మానేయాలి. మీ భాషను ప్రజలు ఛీ కొడుతున్నారని వ్యాఖ్యానించారు. 2024 లో బీజేపీ బలమైన రాజకీయ శక్తిగా అవతరించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.