Home Page SliderNationalNews Alert

జికా వైరస్‌ కలకలం.. కర్ణాటకలో తొలి కేసు నమోదు..

కర్ణాటక రాష్ట్రంలో జికా వైరస్‌ తొలి కేసు నమోదైంది. రాయచూర్‌ జిల్లాలోని 5 ఏళ్ల చిన్నారికి జికా వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి కే సుధాకర్‌ వెల్లడించారు. కొన్ని రోజులుగా చిన్నారి అనారోగ్యానికి గురైందని, డెంగ్యూ, చికెన్‌ గున్యా లక్షణాలు ఉన్నాయనే అనుమానంతో టెస్ట్‌లు చేయించినట్లు తెలిపారు. టెస్టుల్లో పాజిటివ్‌గా రావడంతో చిన్నారికి మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. రాయ్‌చూర్‌ సహా పొరుగు జిల్లాలో ఏవైనా అనుమానిత కేసులు ఉంటే.. పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. గతంలో కేరళ, మహారాష్ట్ర, యూపీ రాష్ట్రాలలో జికా వైరస్‌ కేసులు నమోదైనట్లు మంత్రి పేర్కొన్నారు.

జికా వైరస్‌ ఎలా వ్యాపిస్తుంది..

ఎడెస్‌ అనే దోమ ద్వార జికా వైరస్‌ వ్యాపిస్తుంది. డెంగ్యూ, చికున్‌ గున్యా వంటి ఇన్‌ఫెక్షన్లకు ఈ దోమే కారణం. ఈ వైరస్‌ను మొదటిసారిగా 1947లో ఉగాండాలో గుర్తించారు. ఎడెస్‌ దోమలు సాధారణంగా పగటిపూట కుడతాయి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం సమయంలో ఎక్కువ యాక్టివ్‌గా ఉంటాయి. అయితే.. ఈ వైరస్‌ పెద్దగా ప్రాణాంతకం కాదని వైద్యులు చెబుతున్నారు. చికిత్సతో కూడా రికవరీ అవుతారంటున్నారు.