మంత్రి పదవిపై బిహార్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసు
బిహార్ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి దీపక్ ప్రకాశ్ నియామకంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల్లో గెలవని వ్యక్తిని ఎంతకాలం మంత్రిగా కొనసాగిస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ, దీనిపై సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. దీపక్ ప్రకాశ్ 2025 నవంబర్లో మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం ముఖ్యమంత్రి మార్పుతో క్యాబినెట్ రద్దయినా, సమ్రాట్ చౌధరీ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వంలో ఆయన మళ్లీ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మధ్యలో 22 రోజుల విరామం ఉండటంతో ఆరు నెలల గడువు రెండోసారి వర్తిస్తుందనే వాదనపై వివాదం నెలకొంది.
ఈ నియామకం రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధమంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ సందర్భంగా, “ఎన్నిక కాకుండా ఒక వ్యక్తి ఆరు నెలలకు మించి మంత్రిగా ఎలా కొనసాగుతున్నారు?” అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈ అంశంపై బిహార్ ప్రభుత్వం వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ, తదుపరి విచారణను ఆగస్టు 4కు వాయిదా వేసింది. దీపక్ ప్రకాశ్ రాష్ట్రీయ లోక్ మోర్చా (ఆర్ఎల్ఎం) చీఫ్ ఉపేంద్ర కుశ్వాహా కుమారుడు కావడం గమనార్హం.

