Andhra PradeshHome Page Slider

అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ వ్యవహారంపై కొనసాగుతున్న ఉత్కంఠ

Share with

వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ వ్యవహారంపై ఉత్కంఠ కొనసాగుతోంది. దీనిపై తెలంగాణ హైకోర్టులో విచారణ బుధవారానికి వాయిదా పడింది. ఈ నెల 25వ తేదీ వరకు అవినాష్ రెడ్డిని అరెస్టు చేయవద్దంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై వివేకానంద రెడ్డి కుమార్తె సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించటం దానిపై సిజెఐ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేస్తూ 11 పేజీలతో సుదీర్ఘ తీర్పునిచ్చింది. అవినాష్ రెడ్డికి మధ్యంతర బెయిలు మంజూరు పై తెలంగాణ హైకోర్టు వైఖరిని సిజెఐ ధర్మాసనం తప్పుబట్టింది.

కేసు దర్యాప్తు దశలో ఉండగా హైకోర్టు జోక్యం అవాంఛనీయమని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. సీబీఐ దర్యాప్తును నీరు కార్చేల హైకోర్టు ఉత్తర్వులు ఉన్నాయని నిందితుడిని విచారించే విషయంలో ఉత్తర్వులు ఇచ్చిన తీరు ఏమాత్రం బాగోలేదని సీజేఐ ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. నేర చట్టాలను తిరగరాసే విధంగా హైకోర్టు ఉత్తర్వులు ఉండటం శోచనీయమని సీజేఐ తీర్పులో పేర్కొంది. సీబీఐ అఫడవిట్ లోని అంశాలను తప్పుగా అన్వయించుకుని హైకోర్టు అసాధారణ ఉత్తర్వులు జారీ చేసిందని సీజేఐ ధర్మాసనం వ్యాఖ్యానించింది. చివరకు ఈ ఒక్క రోజైనా అవినాష్ రెడ్డిని అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని అవినాష్ తరపు న్యాయవాది కోరగా దానికి కూడా నిరాకరిస్తూ దీనిపై తెలంగాణ హైకోర్టుని ఆశ్రయించాలని సూచించింది.

ఈ నేపథ్యంలో మంగళవారం ఈ పిటిషన్ విచారణకు రాగా వాదనలు బుధవారం వింటామని తెలంగాణ హైకోర్టు తెలిపింది. ఇక ఇదే కేసులో ఏ1 గా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై కూడా తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఎర్ర గంగిరెడ్డి సాక్షులను ప్రభావితం చేస్తున్నారని సీబీఐ వాదించింది. కాగా బెయిల్ రద్దుకు బలమైన కారణాలు ఏమీ లేవని ఎర్ర గంగిరెడ్డి తరఫున న్యాయవాది వాదించారు. గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలన్న సీబీఐ పిటిషన్ పై విచారణ కూడా బుధవారానికి వాయిదా పడింది.