బాలుడి చివరి కోరిక తీర్చిన పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలంగాణలోని హన్మకొండలో పర్యటించారు. ఈ పర్యటనలో ఆయన ఒక మానవీయ కోణాన్ని ఆవిష్కరిస్తూ అందరి హృదయాలను ఆకట్టుకున్నారు. స్థానిక హనుమాన్ నగర్కు చెందిన 15 ఏళ్ల నిరంజన్ అనే బాలుడు తీవ్రమైన నరాల సమస్యతో బాధపడుతున్నాడు. దురదృష్టవశాత్తూ వయసు 15 ఏళ్లయినా, ఆ వ్యాధి తీవ్రత కారణంగా కేవలం రెండు, మూడేళ్ల పిల్లాడిలాగే కనిపిస్తాడు. పైగా అతనికి కాళ్లు కూడా పనిచేయవు. జీవితంతో పోరాడుతున్న ఆ చిన్నారికి తన అభిమాన హీరో పవన్ కల్యాణ్ను కలవాలని, ఆయన సినిమా డైలాగ్ను ఆయన ముందే చెప్పాలనేది ఒకే ఒక్క చివరి కోరికగా ఉండేది. ఈ విషయం తెలుసుకున్న పవన్ కల్యాణ్, చలించిపోయి నేరుగా ఆ బాలుడి ఇంటికి వెళ్లి పరామర్శించారు. నిరంజన్ను ఎంతో ప్రేమగా పలకరించి, వారి తల్లిదండ్రులతో మాట్లాడి బాలుడి ఆరోగ్య పరిస్థితిని, ప్రస్తుతం అందిస్తున్న చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ భావోద్వేగ భేటీ ముగిసిన తర్వాత పవన్ కల్యాణ్ హన్మకొండలోని ప్రసిద్ధ భద్రకాళి అమ్మవారి ఆలయానికి వెళ్లనున్నారు. అక్కడ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఆ తర్వాత స్థానిక రిసార్ట్లో జనసేన కార్యకర్తలతో (జనసైనికులతో) ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఆయన పాల్గొంటారు. అక్కడే లంచ్ కార్యక్రమంలో పాల్గొని, ఆ తర్వాత హన్మకొండ పర్యటన ముగించుకుని తిరిగి విజయవాడకు ప్రయాణమవుతారు. మరోవైపు, తమ ప్రియతమ నాయకుడు, నటుడైన పవన్ కల్యాణ్ను చూసేందుకు హన్మకొండలో అభిమానులు, జనసైనికులు భారీ సంఖ్యలో పోటెత్తారు. నిరంజన్ అనే అనారోగ్య బాలుడి ఇంటికి వెళ్లి పవన్ కల్యాణ్ అతని కోరిక తీర్చడం స్థానికంగా అందరినీ ఎంతగానో కదిలించింది. డిప్యూటీ సీఎం హోదాలో ఉండి కూడా ఒక సాధారణ అభిమాని కోసం స్వయంగా ఇంటికి రావడం పవన్ కల్యాణ్ సంస్కారానికి నిదర్శనమని ప్రజలు కొనియాడుతున్నారు.

