కైలాసగిరిపై భారీ త్రిశూలం ఆవిష్కరణ
విశాఖపట్నం పర్యాటక రంగంలో సరికొత్త ఆకర్షణగా నిలిచే ‘త్రిశూల్ ప్రాజెక్టు’ కైలాసగిరి కొండపై అత్యంత వైభవంగా ప్రారంభమైంది. సుమారు మూడు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ భారీ త్రిశూలాన్ని రాష్ట్ర మంత్రులు నారాయణ, కొండపల్లి శ్రీనివాస్, విశాఖ ఎంపీ ఎం. శ్రీభరత్లు కలిసి ప్రారంభించారు. నగరం నలుమూలల నుంచి కనిపించేలా ఎత్తయిన కొండపై దీనిని ప్రతిష్టించడం విశేషం. ఆధ్యాత్మికతకు ఆధునిక హంగులను అద్ది పర్యాటకులను ఆకట్టుకునేలా ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దారు. సముద్రతీరంలో సంభవించే తుపానులు, ప్రచండ గాలుల తాకిడిని సైతం తట్టుకుని నిలబడేలా అత్యాధునిక సాంకేతికతతో ఈ నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఈ త్రిశూలం మొత్తం 65 అడుగుల పొడవుతో గంభీరంగా కనిపిస్తుంది. ఇందులో అమర్చిన ఢమరుకం పది అడుగుల ఎత్తు, 18 అడుగుల వెడల్పుతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. రాత్రి వేళల్లో నగరం మొత్తానికి వెలుగులు విరజిమ్మేలా త్రిశూలం లోపల అత్యాధునిక ఎల్ఈడీ దీపాలను ఏర్పాటు చేశారు. దీనివల్ల చీకటిలో కూడా ఈ నిర్మాణం దేదీప్యమానంగా మెరుస్తూ పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తుంది. విశాఖ పర్యాటక చిత్రపటంలో కైలాసగిరి ప్రాముఖ్యతను ఈ ప్రాజెక్టు మరింతగా పెంచుతుందని, భక్తులకు, సందర్శకులకు ఇది ఒక గొప్ప అనుభూతిని మిగిలిస్తుందని ప్రారంభోత్సవ సమయంలో ప్రముఖులు అభిప్రాయపడ్డారు.

