కాంగ్రెస్పై పువ్వాడ విమర్శలు
. జలయజ్ఞం పేరుతో ప్రజాధనం దుర్వినియోగం
వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో అవినీతి, దోపిడీకి గురై నిలిచిపోయిన ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్ ప్రాజెక్టులకు, కేసీఆర్ ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టుగా పునర్జీవం పోసిందని పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం జలయజ్ఞం పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని, ప్రాజెక్టులను అక్రమాలకు నిలయాలుగా మార్చిందని ఆయన విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం కేసీఆర్ ప్రభుత్వం 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో సీతారామ ప్రాజెక్టుకు రూపకల్పన చేసిందని వివరించారు.బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దాదాపు రూ.9 వేల కోట్లు వెచ్చించి కాలువలు, పంప్ హౌస్లు, ట్రాన్స్మిషన్ వ్యవస్థలను నిర్మించామని, భూసేకరణ మరియు పర్యావరణ అనుమతుల వంటి క్లిష్టమైన సమస్యలను పరిష్కరించి 90 శాతం పనులను పూర్తి చేశామని ఆయన వెల్లడించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతాంగానికి సాగునీటి భరోసా కల్పించడమే లక్ష్యంగా కేసీఆర్ ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లారని తెలిపారు.ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఘనత చెప్పుకోవడానికి ఏమీ లేక, బీఆర్ఎస్ ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తోందని ఆయన ఆరోపించారు. తాము చేపట్టిన పనులనే కాంగ్రెస్ మంత్రులు తమ ఘనతగా చెప్పుకోవడం ప్రజలను మోసం చేయడమేనని అన్నారు. ఎవరి కృషి ఏమిటో ప్రజలకు బాగా తెలుసని, వాస్తవాలను వక్రీకరించడం మానుకోవాలని ఆయన హితవు పలికారు.

