14 ఏళ్లు గాడిదలు కాసావా చంద్రబాబు: సీఎం జగన్
వరుసగా నాల్గవ ఏడాది జగనన్న విద్యా కానుక కిట్లు విద్యార్థులకు పంపిణీ కార్యక్రమాన్ని సీఎం జగన్ పల్నాడు జిల్లా క్రోసూర్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ..ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. పేదపిల్లల చేతుల్లో ట్యాబులు కనిపిస్తే ఓర్వలేని బుద్ధి చంద్రబాబుదని సీఎం జగన్ అన్నారు. అన్నింట్లోనూ.. పేదల పట్ల వ్యతిరేకత బుద్ధి ప్రదర్శించాడని, అందుకు కారణం ఆయనలోని పెత్తందారీ మనస్తత్వమని చెప్పారు. సీఎం అయిన 28 సంవత్సరాల తర్వాత.. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత రాయలసీమ, బీసీ, ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్లు అంటూ ఇవాళ చంద్రబాబు మొదలుపెట్టారని ఆ 14 సంవత్సరాలు చంద్రబాబు గాడిదలు కాసారా ? అంటూ సీఎం నిలదీశారు. ఇంటింటి కేజీ బంగారమంటా, బెంజ్ కారు ఇస్తారు అంటా.. ఇటువంటి మాటలు చెప్పే బాబును నమ్మవచ్చా అని సీఎం జగన్ ప్రశ్నించారు. కేవలం ఎన్నికలప్పుడే వాగ్దానాలు.. వెన్నుపోట్లతో చంద్రబాబు చట్రం నడుస్తోందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పెత్తందారీ వ్యవస్థకు, పేదల ప్రభుత్వానికి జరుగుతున్న యుద్ధమని తెలిపారు.
డీపీటీ (దోచుకో, పంచుకో, తినుకో) భావజాలానికి, లంచాలకు తావులేకుండా వివక్షకు చోటులేకుండా నేరుగా లబ్ధి అందిస్తున్న టీబీటీ సర్కార్కు జరుగుతున్న యుద్ధమని తెలిపారు. సామాజిక అన్యాయానికి, సామాజిక న్యాయానికి మధ్య జరుగుతున్న యుద్ధం అని పేర్కొన్నారు. పచ్చ మీడియా విష ప్రచారానికి, ఇంటింటికీ జరిగిన మంచికీ మధ్య జరుగుతున్న యుద్ధమని, ఈ యుద్ధం.. ఈ కురుక్షేత్ర మహాసంగ్రామ యుద్ధమని.. ఇది జగన్ పై జరుగుతున్న యుద్ధం కాదని.. పేదలపై జరుగుతున్న యుద్ధమమి తెలిపారు. మీ జగనన్నకు ఈనాడు కానీ, టీవీ 5 కానీ, ఏబీఎన్ కానీ అండలేవని, దత్తపుత్రుడు అసలే లేడని సీఎం జగన్ చెప్పారు. మీ జగనన్నకు బీజేపీ అండగా ఉండకపోవచ్చు.. వీటినేం మీ జగనన్న నమ్ముకోలేదని తెలిపారు. మీ జగనన్న నమ్ముకుంది దేవుడి దయను, మీ చల్లని దీవెనలేనని అన్నారు.