Home Page SliderPoliticsTelangana

కేసీఆర్‌ ఖబర్దార్‌… దేశాన్ని కించపరిస్తే ఊరుకోం..

Share with

కేసీఆర్‌ అంతరాత్మ కుటుంబ సభ్యుల కోసమే పని  చేస్తుందని, తనయుడు కేటీఆర్‌ను సీఎంను చేయాలనే ఆయన అంతరాత్మ కోరుకుంటోందని కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి విమర్శించారు. ఖమ్మంలో జరిగిన బీఆర్‌ఎస్‌ బహిరంగ సభలో జాతీయ నేతల సమక్షంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. దీనిపై కిషన్‌ రెడ్డి స్పందించారు. కేసీఆర్‌ సీఎం హోదాలో ఉండి దేశాన్ని అవమానిస్తున్నారని  ఫైర్‌ అయ్యారు.  రాజకీయంగా బీజేపీని విమర్శించండి కానీ, దేశాన్ని ఎందుకు కించపరుస్తారని  ప్రశ్నించారు. దేశాన్ని చైనా, పాకిస్థాన్‌లతో పోల్చుతూ విమర్శించడం… సైనికులను అవమానించడం కేసీఆర్‌కు అలవాటుగా మారిందన్నారు. కేసీఆర్‌ చెబుతున్న వెలుగు ప్రగతి భవన్‌లోనూ, ఫాంహౌస్‌లో మాత్రమే ఉందని కిషన్‌ రెడ్డి విమర్శించారు.

భారతదేశంలో గత ఎనిమిదేళ్లలో మేకిన్ ఇండియా కారణంగా దేశీయంగా ఉత్పత్తి పెరిగి విదేశాలకు ఎగుమతులు చేసే స్థాయికి చేరుకున్నామని తద్వారా ఆర్థిక స్థోమత పెరగడంతోపాటు ఉపాధి కల్పన కూడా పెరిగిన విషయం.. అవినీతిపై ధ్యాస ఉన్న కేసీఆర్ కు ఎలా కనిపిస్తుందని కిషన్ రెడ్డి అన్నారు. రక్షణ రంగంలో 2004లో రూ. 900 కోట్లున్న ఎగుమతులు.. ప్రస్తుతం రూ. 14వేల కోట్లకు చేరుకోవడంతోపాటు 71 దేశాలకు మన రక్షణ ఎగుమతులు జరుగుతుండటం మేకిన్ ఇండియాలో భాగమని ఆయన పేర్కొన్నారు. వందే భారత్ రైళ్లు, రైల్వేల్లో రక్షణ వ్యవస్థకోసం దేశీయ సాంకేతికతతో రూపొందించిన ‘కవచ్ సిస్టమ్’, హెచ్ఏఎల్ ఆధ్వర్యంలో హెలికాప్టర్లు వంటివెన్నో మెకిన్ ఇండియాలో వచ్చినవేనన్నారు. దేశంలో మేకిన్ ఇండియా ద్వారా ఇంత ప్రగతి జరుగుతున్నప్పటికీ దాన్ని జోకిన్ ఇండియాగా వ్యవహరించడం కేసీఆర్ విజ్ఞతకే వదిలేస్తున్నానని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

ఇతర దేశాల నుంచి పామాయిల్ దిగుమతులను తగ్గించుకునేందుకే దేశీయంగా పామాయిల్ ఉత్పత్తిని పెంచేలా కేంద్రం ప్రోత్సాహకాలు అందిస్తోందని కిషన్ రెడ్డి తెలిపారు. కేంద్రం ఈ దిశగా ప్రయత్నాలు చేస్తున్నా.. దీనిపై కూడా టీఆర్ఎస్ నాయకులు అనవసర రాజకీయాలు చేస్తున్నారన్నారు. దేశం ప్రజల్లో అన్ని విషయాల్లో స్పష్టత ఉందని.. కేసీఆర్ కుటుంబమే కన్‌ఫ్యూజన్‌లో ఉండి దీన్న ప్రజలపైకి నెట్టడం సరికాదన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల విషయంలోనూ ‘వన్ డిస్ట్రిక్ట్ – వన్ ప్రాడక్ట్’ను ప్రోత్సహించే లక్ష్యంతో కేంద్రం పథకాలను, ప్రోత్సాహకాలు తీసుకొచ్చిందన్నారు. జల వివాదాలను కేంద్రం పరిష్కరించడం లేదంటూ కేసీఆర్ మాట్లాడటం హాస్యాస్పదమని, కృష్ణా జలాల వివాదాన్ని పరిష్కరించేందుకు సమావేశానికి పిలిస్తే.. వాటికి రాకుండా డుమ్మాలు కొట్టిన కేసీఆర్ కు.. ఏపీ ముఖ్యమంత్రితో కలిసి విందు భోజనాలు చేయడానికి మాత్రం సమయం ఉంటుందా? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.

అసెట్ మానిటైజేషన్ కు ప్రైవేటైజేషన్ కు తేడా ఉందని,  భారీగా నష్టాల్లో ఉన్న కంపెనీల భారాన్ని పన్ను చెల్లింపుదారుల మీద పడకుండా ప్రైవేటైజేషన్ జరిగిందన్నారు. ఏడాదికి దాదాపు 800 కోట్ల నష్టాన్ని చవిచూస్తున్న ఎయిర్ ఇండియా భారాన్ని ప్రజలపై మోపడం ఇష్టం లేక.. ఎక్కడినుంచి తీసుకున్నామో తిరిగి ఆ సంస్థకే అప్పగించామని కిషన్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణలో కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఆత్మహత్యలు ఏమాత్రం తగ్గలేదనే విషయాన్ని ఎన్సీఆర్బీ లెక్కలు స్పష్టం చేస్తున్నాయని కిషన్ రె డ్డి పేర్కొన్నారు. ఖమ్మం సమావేశంలో మాట్లాడిన వక్తలు బీఆర్ఎస్ శబ్దాన్ని కూడా ఉచ్ఛరించేందుకు ఆసక్తి చూపకపోవడం ఆ పార్టీ పరిస్థితికి అద్దం పడుతుందన్నారు. దేశంలో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందంటూ అర్థరహితమైన విమర్శలు చేస్తున్న కేసీఆర్.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దారుణంగా ఉన్న విషయాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. కనీసం ఒకటో తేదీన జీతాలు కూడా ఇవ్వలేని స్థితికి రాష్ట్రాన్ని నెట్టేశారన్నారు. చిన్న చిన్న కాంట్రాక్టర్లు కూడా తమ డబ్బులు రాక ధర్నా చేసే పరిస్థితి వచ్చిందని కిషన్ రెడ్డి గుర్తుచేశారు. హాస్టళ్లలో విద్యార్థులు పురుగులు పడ్డ భోజనం చేయడం ఇష్టంలేక రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారన్నారు.

బీఆర్ఎస్ ను గెలిపిస్తే రెండేళ్లో వెలుగు జిలుగులు తీసుకొస్తానని కేసీఆర్ చెప్పడం చూస్తుంటే తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారని, రాష్ట్రాన్ని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చి భూ మాఫియా, ఇసుక మాఫియా, గ్రానైట్ మాఫియాగా మార్చేసిన విషయం అందరికీ తెలుసన్నారు. 9 ఏళ్లుగా కేంద్రం ఇస్తున్న ఉపాధి హామీ నిధులతోనే కాస్తో, కూస్తో పంచాయతీల్లో అభివృద్ధి జరిగిందని.. అంతకు మించి రాష్ట్రం నిధుల కేటాయింపు జరగని కారణంగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే వేసినట్లుందన్నారు. కేంద్రం నిధులను పంచాయతీల ఖాతాల్లో వేస్తే దొంగ డిజిటల్ కీలతో వాటిని కాజేసిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల కుటుంబం కలల్లో మిగిలిపోయే పార్టీయే నని కిషన్ రెడ్డి విమర్శించారు. ప్రజలు కేసీఆర్, కల్వకుంట్ల కుటుంబం తీరుపట్ల విసిగివేసారి పోయారని, వచ్చే ఎన్నికల్లో ఓడించి ఆ కుటుంబాన్ని ఫాంహౌజ్ కు పరిమితం చేయడం ఖాయమని కిషన్ రెడ్డి అన్నారు. కేసీఆర్, బీఆర్ఎస్ ఎన్ని తిట్లు తిడితే బీజేపీకి అవన్నీ ఆశీర్వాదాలుగా మారుతున్నాయని ఆయన అన్నారు.