యువ సంగ్రామ సదస్సుకు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్లోని సరూర్నగర్ స్టేడియంలో శనివారం నిర్వహించనున్న బీఆర్ఎస్ ‘యువ సంగ్రామ సదస్సు’కు తెలంగాణ హైకోర్టు అనుమతి ఇచ్చింది. శాంతిభద్రతల కారణాలను చూపుతూ పోలీసులు తొలుత అనుమతి నిరాకరించగా, బీఆర్ఎస్ కోర్టును ఆశ్రయించింది. విచారణ అనంతరం హైకోర్టు కొన్ని షరతులతో సభ నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయడమే ఈ సదస్సు ఉద్దేశమని బీఆర్ఎస్ నేతలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని వారు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి హామీల అమలును డిమాండ్ చేయనున్నారు.
హైకోర్టు అనుమతితో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఈ సభకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరై యువత, నిరుద్యోగుల కోసం పార్టీ కార్యాచరణను ప్రకటించనున్నట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున పాల్గొనాలని బీఆర్ఎస్ పిలుపునిచ్చింది.

