ప్రధాని పర్యటనపై సీఎస్ రివ్యూ మీటింగ్
ఈ నెల 8వ తేదీన రాష్ట్రానికి వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు విస్తృత ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. రాష్ట్రానికి ప్రధాని పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన సమన్వయ సమావేశానికి సి.ఎస్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సి.ఎస్ మాట్లాడుతూ అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రధాని పర్యటనను విజయవంతం చేయాలని కోరారు. పోలీసు శాఖ బ్లూ బుక్ ప్రకారం తగిన భద్రతా ఏర్పాట్లు, శాంతిభద్రతలు, ట్రాఫిక్, బందోబస్త్ ఏర్పాట్లు చేయాలని అన్నారు. తగినన్ని అగ్నిమాపక పరికరాలు ఏర్పాటు చేయాలని, అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలంలో ఏర్పాటు చేయాలని తెలిపారు. వైద్య సిబ్బంది, అంబులెన్స్, ఇతర సౌకర్యాలను సిద్ధంగా ఉంచాలన్నారు. ప్రధాని కాన్వాయ్ ప్రయాణించే రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలన్నారు. అన్ని వేదికల వద్ద అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తేలియజేశారు. డీజీపీ అంజనీకుమార్, సీనియర్ పోలీసు అధికారులు, రైల్వే సహా వివిధ శాఖల అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.