ఎయిర్ ఇండియా విమానాన్ని ఢీకొన్న పక్షి
- తప్పిన ప్రమాదం
ఢిల్లీ నుంచి రాయ్పూర్కు ప్రయాణికులతో వస్తున్న ఎయిర్ ఇండియా విమానాన్ని ల్యాండింగ్ సమయంలో పక్షి ఢీకొంది. రన్వేపై దిగుతున్న తరుణంలో ఈ ప్రమాదం జరిగినప్పటికీ, పైలెట్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రయాణికులు, సిబ్బంది అంతా సురక్షితంగా బయటపడ్డారు. రాయ్పూర్ విమానాశ్రయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు అధికారులు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. పక్షి ఢీకొన్న వెంటనే పైలెట్లు భద్రతా నిబంధనల ప్రకారం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (ఎస్వోపీ) అమలు చేశారన్నారు. అనంతరం విమానాన్ని పూర్తిగా తనిఖీ చేసి, ఎలాంటి ముప్పు లేదని నిర్ధారించిన తర్వాతే ప్రయాణానికి అనుమతించారని వివరించారు. ఇటీవల విమానాలకు ఇలాంటి అంతరాయాలు వరుసగా ఎదురవుతున్నాయి. ఈనెల 8న ఢిల్లీ విమానాశ్రయం హ్యాంగర్లో ఉన్న మూడు ఎయిర్ ఇండియా విమానాలు భారీ ఈదురు గాలులకు దెబ్బతిన్నాయి. గత శుక్రవారం కూడా బెంగళూరులో ఓ ఇండిగో విమానాన్ని టేకాఫ్ సమయంలో పక్షి ఢీకొనడంతో ప్రయాణం గంటన్నర ఆలస్యమైంది.

