ఏపీ ఎడ్సెట్-2026 ఫలితాలు విడుదల
99.30 శాతం రికార్డు ఉత్తీర్ణత
ఆంధ్రప్రదేశ్లో బీఎడ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీ ఎడ్సెట్)-2026 ఫలితాలు అధికారికంగా విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మంగళవారం ఈ ఫలితాలను వెల్లడించారు. ఈ ఏడాది ఎడ్సెట్లో రికార్డు స్థాయిలో 99.30 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు ఆయన ప్రకటించారు. పరీక్షకు మొత్తం 19,880 మంది అభ్యర్థులు హాజరు కాగా, వారిలో 19,741 మంది అర్హత సాధించారు. అద్భుతమైన ప్రతిభ కనబరిచి అర్హత సాధించిన అభ్యర్థులందరికీ మంత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ, వీరంతా భవిష్యత్తులో ఉత్తమ ఉపాధ్యాయులుగా రాణించాలని ఆకాంక్షించారు. అభ్యర్థులు తమ ఫలితాలను, ర్యాంక్ కార్డులను అధికారిక వెబ్సైట్ (cets.apsche.ap.gov.in) ద్వారా సులభంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంటర్నెట్ ఇబ్బందులు ఉన్నవారి కోసం ఈసారి ప్రత్యేకంగా 9552300009 అనే వాట్సాప్ నంబర్ ద్వారా కూడా ఫలితాలను తెలుసుకునే సదుపాయాన్ని కల్పించారు. ఎడ్సెట్లో అర్హత సాధించిన అభ్యర్థులు తదుపరి నిర్వహించే కౌన్సెలింగ్ ప్రక్రియకు హాజరై, రాష్ట్రంలోని వివిధ కళాశాలల్లో బీఎడ్ కోర్సుల్లో ప్రవేశాలు పొందాల్సి ఉంటుంది.

