ఏఐ పాలనలో యూఏఈ సరికొత్త రికార్డు
గల్ఫ్ దేశమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) కృత్రిమ మేధ వినియోగంలో ప్రపంచానికే మార్గదర్శిగా నిలిచేందుకు సిద్ధమైంది. రాబోయే రెండేళ్లలో, అంటే 2028 నాటికి 50 శాతం ప్రభుత్వ సేవలు, కార్యకలాపాలు, విభాగాలు ‘ఏజెంటిక్ ఏఐ’ ద్వారా నిర్వహించబడతాయని యూఏఈ ప్రధాని షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మఖ్తుమ్ అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం మనం వాడుతున్న సాధారణ ఏఐ వ్యవస్థలు కేవలం మన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తాయి. కానీ ఏజెంటిక్ ఏఐ అంతకు మించి పనిచేస్తుంది. ఇది కేవలం సమాచారం ఇచ్చే సాధనం మాత్రమే కాదు, ఒక పనిని పూర్తి చేసే ‘భాగస్వామి’గా మారుతుంది. దీనికి ఒక లక్ష్యం ఇస్తే, దాన్ని పూర్తి చేయడానికి కావాల్సిన వివిధ దశలను తానే ప్లాన్ చేసుకుని, అవసరమైన చర్యలు తీసుకుంటుంది. నిర్ణయాలు తీసుకునే ప్రక్రియను వేగవంతం చేయడంలోనూ, ప్రజా సేవలను మరింత పారదర్శకంగా అందించడంలోనూ ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ఈ స్థాయిలో ప్రభుత్వ కార్యకలాపాల్లో కృత్రిమ మేధను అనుసంధానిస్తున్న మొదటి దేశంగా యూఏఈ నిలవనుంది. కేవలం సాంకేతికతను వాడటమే కాకుండా, ఫెడరల్ ఉద్యోగులందరికీ ఏఐపై ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని, వారి పనితీరును ఏఐ అడాప్షన్ వేగం ఆధారంగా అంచనా వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత రెండు దశాబ్దాలుగా డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ లో అగ్రగామిగా ఉన్న యూఏఈ, ఈ సరికొత్త నిర్ణయంతో భవిష్యత్తు పాలన ఎలా ఉండబోతోందో ప్రపంచానికి చాటిచెబుతోంది.

