హైదరాబాద్ పాలనకు కొత్త చట్టం
తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ మహానగర పాలనను ఆధునీకరించే లక్ష్యంతో ‘కోర్ అర్బన్ రీజియన్ (కోర్) బిల్లు–2026’ ముసాయిదాను విడుదల చేసింది. 1955 జీహెచ్ఎంసీ చట్టానికి బదులుగా రూపొందించిన ఈ బిల్లు ద్వారా జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్లను ఒకే సమగ్ర పాలనా వ్యవస్థలోకి తీసుకురానున్నారు. ట్రాన్స్జెండర్ సభ్యునికి ప్రాతినిధ్యం, కాలం చెల్లిన ఎన్నికల అనర్హత నిబంధనల తొలగింపు వంటి కీలక మార్పులు ఇందులో ఉన్నాయి.
ఆస్తి పన్నును క్యాపిటల్ వాల్యూ ఆధారంగా నిర్ణయించడం, సెల్ఫ్ అసెస్మెంట్ విధానం, సమగ్ర ఆస్తి గుర్తింపు కోడ్, సమయానికి పన్నులు చెల్లించే వారికి రాయితీలు కల్పించనున్నారు. అలాగే భవన నిర్మాణాలకు ‘డీమ్డ్ అప్రూవల్’, అన్ని వ్యాపారాలకు ఒకే ట్రేడ్ లైసెన్స్, నైట్ ఎకానమీ విధానం, చిన్న ఉల్లంఘనలకు సివిల్ జరిమానాల వ్యవస్థను ప్రవేశపెడుతున్నారు.
పాలనను మరింత సమర్థవంతం చేసేందుకు ముఖ్యమంత్రి అధ్యక్షతన అపెక్స్ గవర్నెన్స్ కౌన్సిల్ ఏర్పాటు చేయనుండగా, చెరువులు, కాలువలు, ప్రభుత్వ భూముల పరిరక్షణ బాధ్యతలను హైడ్రాకు అప్పగించనున్నారు. ప్రజల నుంచి సూచనలు స్వీకరించేందుకు జులై 24, 2026 వరకు అవకాశం కల్పించిన ప్రభుత్వం, వాటిని పరిశీలించి తుది బిల్లును రూపొందించనున్నట్లు తెలిపింది.

