అంతర్జాతీయ తెలుగు మహాసభలకు ముఖ్యఅతిథిగా మిజోరాం గవర్నర్
అంతర్జాతీయ తెలుగు మహాసభలకు ముఖ్యఅతిథిగా మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబును ఆహ్వానించినట్లు నిర్వాహకులు తెలిపారు. చైతన్య విద్యాసంస్థలు, ఆంధ్ర సారస్వత పరిషత్ సంస్థ, సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సభలను రాజమహేంద్రవరంలోని గైట్ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో 2024 జనవరి 5,6,7 తేదీలలో నిర్వహిస్తున్నారు. శ్రీ రాజరాజ నరేంద్ర మహారాజు పట్టాభిషేక మహోత్సవ సహస్రాబ్ది సందర్భంగా రాజమహేంద్రవరంలో దీనిని ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా చైతన్య విద్యాసంస్థల చైర్మన్ చైతన్యరాజు, ఆంధ్రసారస్వత పరిషత్ అధ్యక్షులు డా. గజల్ శ్రీనివాస్ విశాఖలో గవర్నర్ హరిబాబును కలిసి ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఆయన అంగీకరించినట్లు సమాచారం. జనవరి 6 ఉదయం జరిగే కృతజ్ఞతాంజలి సభకు వస్తారని, కళాకారుల్ని సత్కరిస్తారని గజల్ శ్రీనివాస్ తెలిపారు. ఆంధ్రమేవ జయతే అనే నినాదంతో తెలుగు భాషా వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు.