బస్సుపై ప్రేమ.. నెటిజన్లను కదిలిస్తున్న డ్రైవర్ భావోద్వేగం
స్టీరింగ్ను ముద్దాడి, బస్సును కౌగిలించుకుని..నెటిజన్లను కదిలిస్తున్న డ్రైవర్ భావోద్వేగం వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అసలు విషయమేమిటంటే.. తమిళనాడు రాష్ట్ర రవాణా సంస్థకు చెందిన ఓ డ్రైవర్ పదవీ విరమణ రోజున చివరిసారిగా బస్సును చూసుకుంటూ కన్నీరు పెడుతున్న ఆ డ్రైవర్ భావోద్వేగం అందరి మనసులను కదలిస్తోంది. డ్రైవర్ ముత్తుపండి స్టీరింగ్ను ముద్దాడి, క్లచ్, గేర్, బ్రేక్.. ఇలా అన్నింటినీ తడుముతూ, నమస్కరిస్తూ బస్సులోంచి కిందకి దిగుతూ.. ఫుట్ బోర్డుకు నమస్కరించి, బస్సు ముందుకు వచ్చి సంవత్సరాల తరబడి బస్సుతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కన్నీటితో బస్సును కౌగిలించుకున్నారు. నేటితో తమ బంధానికి ముగింపు పలకాల్సిన సమయం వచ్చిందని భావోద్వేగానికి గురయ్యారు. ఇదంతా తోటి ఉద్యోగులు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్తా వైరల్గా మారింది.
మరో వైపు.. తెలంగాణ ఆర్టీసీ ఎండీ వి.సి. సజ్జనార్ కూడా వీడియో చూసి చలించిపోయి ట్వీట్ చేశారు. తన ఉద్యోగ విరమణ వేళ ఆర్టీసీ డ్రైవర్ భావోద్వేగానికి గురైన ఘటన అందరి మనసులను కదిలిస్తోందన్నారు. 30 ఏళ్ల పాటు బస్సుతో తనకున్న అనుబంధాన్ని ఇలా గుర్తు చేసుకున్నారన్నారు. ఆర్టీసీలో ఉద్యోగులు తమ వృత్తిని ఎంతగానో ఇష్టపడి నిబద్ధతతో పనిచేస్తారని చెప్పడానికీ ఈ డ్రైవర్ సన్నివేశమే ఓ ఉత్తమ ఉదాహరణ అని కొనియాడారు.