భారత్ ను కవ్విస్తోన్న పాక్ మంత్రి
పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరోసారి భారత్పై తన ఆగ్రహాన్ని వెళ్లగక్కుతూ కవ్వింపు చర్యలకు దిగారు. భవిష్యత్తులో భారత్ నుంచి ఎలాంటి సైనిక దాడి జరిగినా పాకిస్తాన్ అత్యంత తీవ్రంగా, నిర్ణయాత్మక రీతిలో స్పందిస్తుందని ఆయన హెచ్చరించారు. సరిగ్గా ఏడాది క్రితం భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ దాడులు ముగిసి ఏడాది పూర్తయిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. 2025 మే 7న భారత్.. పాకిస్తాన్ తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతాల్లోని ఉగ్రవాద మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకుని మెరుపు దాడులు జరిపిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో రెండు దేశాల మధ్య నాలుగు రోజుల పాటు యుద్ధ వాతావరణం నెలకొనగా, మే 10న సైనిక చర్యలను నిలిపివేస్తూ రెండు పక్షాలు ఒక అవగాహనకు వచ్చాయి.
పాకిస్తాన్ ఎల్లప్పుడూ శాంతినే కోరుకుంటుందని, అయితే తమ దేశ గౌరవం, సార్వభౌమాధికారం విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ఆసిఫ్ స్పష్టం చేశారు. భారత్ నుంచి ఎలాంటి సాహసోపేత చర్యలు ఎదురైనా, వాటిని తిప్పికొట్టేందుకు వీలుగా గాలి, భూమి, సముద్ర మార్గాల్లో తమ సైనిక సామర్థ్యాలను గణనీయంగా పెంచుకున్నామని ధీమా వ్యక్తం చేశారు. ఖవాజా ఆసిఫ్ ఇటీవలి కాలంలో పదేపదే భారత్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. భారత్ తమపై దాడికి దిగితే కోల్కతా నగరం వరకు చేరుకుని దాడి చేయగలమంటూ ఆయన గతంలో చేసిన ప్రకటనలు అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారాయి. పశ్చిమాసియాలో ఇప్పటికే యుద్ధ మేఘాలు కమ్ముకున్న తరుణంలో, పాక్ మంత్రి ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం దక్షిణాసియాలో ఆందోళన కలిగిస్తోంది.

