InternationalNews

వినూత్నంగా హర్‌ ఘర్‌ తిరంగా వేడుకలు

Share with

దేశ వ్యాప్తంగా హర్‌ ఘర్‌ తిరంగా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో ప్రజలు చురుకుగా పాల్గొంటున్నారు. ఆగస్టు 13 నుంచి 15 వరకు తమ ఇళ్లపై త్రివర్ణ పతాకాలు ఎగరేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. కేంద్రమంత్రి అమిత్‌ షా, ఇతర మంత్రులు, ప్రజలు తమ ఇళ్లపై జెండా ఎగరేశారు.

ఇదిలా ఉండగా.. చండీగఢ్‌లో హర్‌ ఘర్‌ తిరంగా వేడుకలను వినూత్నంగా నిర్వహించారు. అతి పెద్ద జాతీయ జెండా రూపంలో మానవహారంగా నిలబడి గిన్నీస్‌ రికార్డు సృష్టించారు. చండీగఢ్‌ విశ్వవిద్యాలయంలో 16 ఎకరాల క్రికెట్‌ స్టేడియంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకల్లో 5,885 మంది జాతీయ జెండా రంగుల డ్రెస్స్‌లు ధరించి మానవహారంగా నిలుచున్నారు.

NID ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి మీనాకేశీ లేఖీ, చండీగఢ్‌ యూనివర్శిటీ ఛాన్సలర్‌ సత్నామ్‌ సింగ్‌ సంధు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. మానవహారం జాతీయ జెండా గిన్నీస్‌ బుక్‌ రికార్డు సాధించింది. ఈమేరకు గిన్నిస్‌ వరల్డ్‌ డేటా ఎడ్యుకేటర్‌ స్వప్నిల్‌ దంగరికర్‌ ధృవీకరించారు. గతంలో ఈ రికార్డు అబుదాబిలో జెమ్స్‌ స్కూల్‌ సాధించారని చెప్పారు. యూఏఈలో 2017లో 4130 మందితో ఆ దేశ జెండా రెపరెపలాడించారని పేర్కొన్నారు. ఆ రికార్డులను చండీగఢ్‌ యూనీవర్సిటీ విద్యార్థులు తిరగరాశారని తెలిపారు. ఈ సందర్భంగా చండీగఢ్‌ గవర్నర్‌ బన్వరీలాల్‌ పురోహిత్‌ విద్యార్థులను అభినందించారు.