బీజేపీలోకి ఎర్రబెల్లి ప్రదీప్, కాంగ్రెస్ నేతలు
టీఆర్ఎస్ నేత, తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు, వరంగల్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ అధ్యక్షుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు బీజేపీలో చేరారు. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన ప్రదీప్.. మునుగోడులో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు బీజేపీ తీర్థం పుచ్చుకోవాల్సి ఉంది. అయితే.. అప్పుడు సాధ్యం కాకపోవడంతో ప్రదీప్ గురువారం ఢిల్లీ వెళ్లి బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా చేతుల మీదుగా కాషాయ కండువా కప్పుకున్నారు. ప్రదీప్తో పాటు కాంగ్రెస్ నేతలు బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, వీటి విజయ్ కుమార్, యోగానంద్ కొల్లూరు కూడా బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జి తరుణ్ ఛుగ్, గరికపాటి మోహన్ రావు కూడా ఉన్నారు. తెలంగాణాలో బీజేపీ బలంగా ఉందని, అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని ప్రదీప్ రావు అన్నారు.