Home Page SliderTelangana

రాజేందర్ నువ్వే గెలుస్తున్నావ్!? మాజీ మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు

Share with

మాల్కాజ్‌గిరి నుంచి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ లోక్ సభ ఎన్నికల్లో గెలుస్తున్నారని మాజీ మంత్రి మల్లారెడ్డి చెప్పారు. వచ్చే నెల 13న జరగనున్న ఎన్నికల్లో ఈటల గెలుపు ఖాయమన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. నియోజకవర్గపరిధిలో కొంపల్లిలో జరిగిన కార్యక్రమంలో ఈటల, మల్లారెడ్డి తారసపడ్డారు. ఈ సందర్భంగా ఎన్నికల క్యాంపెయిన్ గురించి ఇద్దరు నేతలు మాట్లాడుకున్నారు. గతంలో మల్కాజ్‌గిరి ఎంపీగా విజయం సాధించిన మల్లారెడ్డి, ఈసారి ఎన్నికల్లో ఈటల గెలుస్తారని చెప్పడం విశేషం. రాష్ట్రంలో ఈ ఎన్నికల్లో 17 స్థానాల్లో మెజార్టీ చోట్ల గెలుపు లక్ష్యంగా భారతీయజనతా పార్టీ పనిచేస్తోంది. ఇక నగరానికి సమీపంలో ఉన్న మల్కాజ్‌గిరిపై కాషాయ జెండా ఎగురేయడం ఖాయమని జోరుగా ప్రచారం జరుగుతుంది. నియోజకవర్గంలో అనుభవజ్ఞుడైన నాయకుడిని గెలిపించుకుంటే సమస్యల పరిష్కారం అవుతాయన్న విశ్వాసంతో ఓటర్లు సైతం ఉన్నారు.

ఈటల రాజేందర్ మొదట్నుంచి రాష్ట్ర రాజకీయాల్లో చురుగ్గా ఉండటం వల్ల ఆయన ఇక్కడ్నుంచి సునాయాశంగా గెలుస్తారన్న భావన సర్వత్రా ఉంది. నియోజకవర్గంలోని ప్రజలకు సుపరిచితుడు కావడం కూడా ఆయనకు కలిసొచ్చే అవకాశం ఉంది. దేశంలోనే ఎన్నికల ప్రచారం మొదలైన రోజు, ప్రధాని నరేంద్రమోదీ మల్కాజ్‌గిరి పరిధిలో రోడ్ షో నిర్వహించడం, ఈటలను గెలిపిస్తే, అభివృద్ధికి అండగా ఉంటానని చెప్పడం కూడా జరిగింది. దీంతో ఈసారి లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ గెలుపుపై సంపూర్ణ విశ్వాసం కన్పిస్తోంది. మల్కాజ్‌గిరిలో ఈటల గెలుపు ఖాయమని, మెజార్టీ లెక్కలు మాత్రమే వేసుకోవాల్సి ఉందన్న అభిప్రాయాన్ని పార్టీ నేతలు, నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.