నలుగురు గుజరాతీలు భారతదేశ చరిత్రగతిని మార్చేశారు: అమిత్ షా
భారతదేశ ఆధునిక చరిత్రలో నలుగురు గుజరాతీలు – మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, మొరార్జీ దేశాయ్, నరేంద్ర మోడీ – గణనీయమైన కృషి చేశారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా గురువారం అన్నారు. శ్రీ ఢిల్లీ గుజరాతీ సమాజ్కు 125 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన షా, ప్రధాని నరేంద్ర మోదీ వల్లే భారతదేశ కీర్తి ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోందన్నారు. “మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, మొరార్జీ దేశాయ్ మరియు నరేంద్ర మోడీ, ఈ నలుగురు గుజరాతీలు భారతదేశ ఆధునిక చరిత్రలో గణనీయమైన కృషి చేశారు” అని చెప్పారు.

గాంధీజీ కృషి వల్లే దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని, సర్దార్ పటేల్ వల్ల దేశం ఏకమైందని, మొరార్జీ దేశాయ్ వల్ల దేశ ప్రజాస్వామ్యం పునరుజ్జీవం పొందిందని, నరేంద్ర మోదీ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా భారతదేశం సంబరాలు చేసుకుంటోందని హోంమంత్రి అధికారిక ప్రకటనలో తెలిపారు. ఈ నలుగురు గుజరాతీలు గొప్ప విజయాలు సాధించారని, వారు యావత్ జాతికే గర్వకారణమని ఆయన గుజరాతీలో చేసిన ప్రసంగంలో పేర్కొన్నారు. గుజరాతీ కమ్యూనిటీ దేశం, ప్రపంచవ్యాప్తంగా ఉందని, ఏ సమాజంలోనైనా ఎల్లప్పుడూ బాగా కలిసిపోయిందని, అదే సమయంలో సేవ చేస్తూ ఉంటోందని షా అన్నారు. ఢిల్లీలో నివసిస్తున్న గుజరాతీలను వారి సంస్కృతి, నాగరికతతో అనుసంధానం చేయడంతో పాటు దేశ, సమాజ సేవ వైపు వారిని చైతన్యపరిచే పనిని ఈ సంస్థ చేసిందని కొనియాడారు.

125 ఏళ్లు పూర్తి చేసుకున్నందుకు ఈ సంస్థతో అనుబంధం ఉన్న వారందరికీ హోంమంత్రి అభినందనలు తెలిపారు. గుజరాతీ కమ్యూనిటీ ఢిల్లీలో నివాసం ఉంటున్నప్పటికీ, గుజరాతీ సమాజం, గుజరాత్ పరంపరను కొనసాగించిందని, దాని సంస్కృతిని ప్రోత్సహించి, సంరక్షించిందని, ముందుకు తీసుకువెళ్లిందని పేర్కొన్నారు. ప్రతి వర్గానికి చెందిన ప్రజలు ఢిల్లీలో నివసిస్తున్నారని, గుజరాతీ కమ్యూనిటీ కూడా నగరంపై చెరగని ముద్ర వేసిందని వివరించారు. ప్రధాని మోదీ తొమ్మిదేళ్ల పాలనను ప్రస్తావిస్తూ, ఈ కాలంలో దేశం అనేక విజయాలు సాధించిందని షా అన్నారు.

2014లో మోదీ ప్రధాని అయినప్పుడు భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో 11వ స్థానంలో ఉందని, ఈరోజు తొమ్మిదేళ్ల తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో 5వ స్థానంలో ఉందన్నారు. ఇప్పుడు ఐఎంఎఫ్తో సహా అనేక ఏజెన్సీలు భారత ఆర్థిక వ్యవస్థను ఒక ప్రకాశవంతమైన ప్రదేశంగా చూస్తున్నాయని హోం మంత్రి తెలిపారు. మోదీ నిర్ణయాత్మక నాయకత్వంలో సర్జికల్, వైమానిక దాడులు నిర్వహించి భారత్ సరిహద్దులను ఎవరూ తారుమారు చేయలేరన్న సందేశాన్ని ప్రపంచానికి చాటిచెప్పిందన్నారు. 130 కోట్ల మంది జనాభా ఉన్న భారతదేశం వంటి విశాలమైన దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ సజావుగా పూర్తయిందని షా అన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ ఉత్పత్తిదారుగా అవతరించిందని, స్టార్టప్ల రంగంలో భారత్ మూడో స్థానంలో ఉందని, పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిలో నాలుగో స్థానంలో ఉందన్నారు.

జమ్మూ కాశ్మీర్లో ఎలాంటి హింసాకాండ జరగకుండా ఆర్టికల్ 370ని రద్దు చేసే పనిని ప్రధాని చేశారని, ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ విధానాన్ని రూపొందించారని, దీని ఫలితంగా తొమ్మిదేళ్లలో ఒక్క పెద్ద ఉగ్రవాద ఘటన కూడా జరగలేదన్నారు. దేశ అంతర్గత భద్రత, సరిహద్దుల భద్రతను పటిష్టం చేసేందుకు మోదీ అనేక ప్రయత్నాలు చేశారని షా అన్నారు. మోదీ అందరికీ చెందినవారని, అందరూ ఆయనకు చెందినవారని, ఇది అందరికీ గర్వకారణమని వివరించారు.

