ఫ్యూడల్ పాలనను అంతం చేయాలి…
ప్రజా తెలంగాణ కోసం మరో ఉద్యమం వచ్చే ఆస్కారం ఉంది.
ప్రజలు మెచ్చే పాలన అతి త్వరలో వస్తుంది.
మాజీ ముఖ్యమంత్రి మర్రిచెన్నారెడ్డి గారి 103 వ జయంతి సందర్భంగా లోయర్ టాంక్ బండ్ వద్ద ఉన్న చెన్నారెడ్డి గారి ఘాట్ లో మర్రి శశిధర్ రెడ్డి గారితో కలిసి బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. “తెలంగాణ ఉద్యమం మూడు దఫాలుగా సాగింది. 1951-52 ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ ఉద్యమం, మా ఉద్యోగాలు మాకు కావాలని.. స్వయం పాలన కావాలని.. మర్రి చెన్నారెడ్డి గారి నాయకత్వంలో 1969 ఉద్యమం కొనసాగింది. ఆనాడు ఇంత సమాచారం వ్యవస్థ లేకపోయినప్పటికీ కూడా తెలంగాణ 10 జిల్లాలలో వయసుతో, పార్టీలతో సంబంధం లేకుండా.. తెలంగాణ మట్టి బిడ్డలుగా రాష్ట్రాన్ని సాధించుకోవడం కోసం అకుంఠిత దీక్షతో ఉద్యమం కొనసాగింది. ఆనాడు ఆ ప్రభుత్వాల తూటాలకు 369 మంది ముక్కుపచ్చలారని ముద్దుబిడ్డలు అసువులు బాసిన సంఘటన తెలంగాణ సమాజం ఇప్పటికీ గుర్తు పెట్టుకుంది” అని ఈటల వివరించారు.

“మరోవైపు ప్రజాస్వామ్యబద్దంగా మూడవ దఫా ఉద్యమం కొనసాగింది. మూడు తరాల ఉద్యమం, తెలంగాణ ప్రజల ఆకాంక్ష 2014లో నెరవేరింది. కానీ అమరత్వంతో వచ్చిన తెలంగాణలో..అమరవీరుల ఆశయాలను నెరవేర్చుకోవాల్సిన క్రమంలో మళ్లీ సమాజమును బానిసత్వంలోకి తీసుకుపోయే పద్ధతి వచ్చింది. ఫ్యూడల్ మనస్తత్వంతో రాష్ట్రాన్ని నడుపుతున్నారు. ఏ ఆత్మగౌరవం కోసం, ఏ ఉద్యోగాల కోసం, ఏ అభివృద్ధి కోసం, తెలంగాణను దేశ చిత్రపటంలో నెంబర్ వన్ స్థానంలో ఉండాలని కొట్లాడేమో అవన్నీ కలలుగానే మిగిలిపోయాయి. తెలంగాణలో వీరి పరిపాలన చూసిన తర్వాత అయ్యో తెలంగాణ వస్తే ఇలా ఉంటుందా అని బాధపడే పరిస్థితి వచ్చింది. ప్రజాస్వామిక తెలంగాణ కోసం మరో ఉద్యమం వచ్చే ఆస్కారం ఉంటుందని తెలంగాణ ఉద్యమ సమయంలోనే మాట్లాడాము. ప్రజల భాగస్వామ్య పాలన కొనసాగాలంటే మరో ఉద్యమం రావాల్సిందే అని అప్పుడే అన్నారు.” అని ఈటల స్పష్టం చేశారు.

“భౌగోళిక తెలంగాణ సాధించుకున్నాం. ప్రజలకు నచ్చిన ప్రజలకు అనుకూలమైన పాలన అతి తక్కువ కాలంలో వస్తుంది. ప్రజలు మెచ్చే పరిపాలన వస్తుందని ఆశిస్తున్నాము.చెన్నారెడ్డి గారు ఆనాడు కలలుకన్నటువంటి.. మనిషిని మనిషి గౌరవించే ప్రజాస్వామిక తెలంగాణ కావాలని కోరారు. ఆకలికేకలులేని, ఆత్మగౌరవంతో ఉన్న తెలంగాణ కావాలని కోరారు. తప్పకుండా అది వచ్చి తీరుతుంది. లేదంటే రాబోయే కాలంలో ప్రజలు నెరవేర్చుకుంటారని ఆశిస్తూ ఉన్నాము. మర్రి చెన్నారెడ్డి గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. ఆయన మన మధ్య లేకపోయినా కూడా తెలంగాణ సమాజం ఉన్నంతవరకు ఆయన మదిలో ఉంటారు” అని ఈటల రాజేందర్ అన్నారు.

