విద్యార్థుల హక్కులు కాపాడాలి: రాహుల్
నీట్ పేపర్ లీక్ అంశంపై సీజేపీ నిర్వహిస్తున్న నిరసనల్లో పాల్గొనవద్దని పలు విశ్వవిద్యాలయాలు విద్యార్థులకు సూచించడంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో జరుగుతున్న తప్పులను ప్రశ్నించడం, ప్రజాస్వామ్య హక్కులను వినియోగించుకోవడం విద్యార్థుల హక్కని, వారిని ఆందోళనలకు దూరంగా ఉండాలని హెచ్చరించే హక్కు యూనివర్సిటీలకు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. ఇలాంటి చర్యలకు భవిష్యత్తులో జవాబుదారీగా ఉండాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు.
జంతర్మంతర్లో జరిగే నిరసనల నేపథ్యంలో చట్టపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందని పేర్కొంటూ, దిల్లీ యూనివర్సిటీ, జేఎన్యూ, ఐఐటీ రూర్కీ, ఐఐటీ మద్రాస్ సహా పలు విద్యాసంస్థలు విద్యార్థులు అక్కడికి వెళ్లవద్దని, సోషల్ మీడియాలో నిరసనలకు సంబంధించిన పోస్టులు కూడా చేయవద్దని సర్క్యులర్లు జారీ చేశాయి. ఈ సూచనలు సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకేనని తెలిపాయి.
ఈ సర్క్యులర్లపై పలువురు ప్రముఖులు కూడా విమర్శలు గుప్పించారు. దిల్లీ యూనివర్సిటీ మాజీ విద్యార్థి, ఎంపీ దీపేందర్ హుడా యూనివర్సిటీ ప్రకటనను ఖండించగా, నటి పూజా భట్ విద్యార్థుల ప్రజాస్వామ్య హక్కులకు మద్దతు ఇవ్వాలని వ్యాఖ్యానించారు.

