Breaking NewsHome Page SliderNewsTelanganaTrending Today

పేదల ఇంటి కలకు ఇందిరమ్మ ఇళ్లు

రాష్ట్రంలో మహిళల ఆర్థిక, సామాజిక సాధికారతకు కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. శుక్రవారం మార్కుక్‌లో జరిగిన ‘నాభి శిల ప్రతిష్ట’ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తూ ప్రజలకు సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని మంత్రి తెలిపారు. పేదలు, మహిళలు, రైతులు, యువత సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి కుటుంబం ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఇందిరమ్మ గృహాల పథకం ద్వారా నిరుపేదల సొంతింటి కలను సాకారం చేస్తున్నామని, గూడు లేని కుటుంబాలను ఇంటి యజమానులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ఉద్దేశమని వివరించారు. గ్రామీణాభివృద్ధి, మహిళా సాధికారత, సామాజిక న్యాయమే కాంగ్రెస్ ప్రభుత్వ అజెండా అని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మల్లేష్ గౌడ్, గ్రామ అధ్యక్షుడు జితేందర్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ కనకయ్య గౌడ్‌తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. ప్రజల భాగస్వామ్యంతో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తామని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.