వినేష్ ఫోగాట్కు డోర్స్ క్లోజ్
ప్రముఖ భారతీయ రెజ్లర్ వినేష్ ఫోగాట్ క్రమశిక్షణారాహిత్యం, డోపింగ్ నిబంధనల ఉల్లంఘన ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI) ఆమెపై కఠిన చర్యలు తీసుకుంది. ఈ ఆరోపణల నేపథ్యంలో వినేష్కు డబ్ల్యూఎఫ్ఐ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. జూన్ 26 వరకు ఆమెను దేశీయ పోటీల్లో పాల్గొనకుండా అనర్హురాలిగా ప్రకటించింది. ఈ నిర్ణయంతో ఉత్తరప్రదేశ్లోని గొండాలో మే 10 నుంచి 12 వరకు జరగనున్న జాతీయ ఓపెన్ ర్యాంకింగ్ టోర్నీలో ఆమె పాల్గొనే అవకాశం కోల్పోయారు. పదవీ విరమణ నుంచి తిరిగి పోటీల్లోకి వచ్చేముందు ఇవ్వాల్సిన ఆరు నెలల నోటీసు వ్యవధిని వినేష్ పూర్తి చేయలేదని డబ్ల్యూఎఫ్ఐ పేర్కొంది. ఆమె ప్రవర్తన భారత రెజ్లింగ్ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉందని ఆరోపించింది. డబ్ల్యూఎఫ్ఐ మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ స్వస్థలమైన గొండాలో పోటీలు జరగడం పట్ల వినేష్ గతంలోనే ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడ పోటీపడటం తనకు మానసిక ఒత్తిడి కలిగిస్తుందని ఆమె పేర్కొన్నారు. పారిస్ ఒలింపిక్స్ 2024 అనర్హత వేటుతో పాటు, ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఈ నాలుగు ప్రధాన ఆరోపణలపై వివరణ ఇవ్వాలని వినేష్ను డబ్ల్యూఎఫ్ఐ కోరింది.

