8 మంది ప్రభుత్వ టీచర్లను చేసుకున్న నిత్యపెళ్లికొడుకు
ఉత్తర్ప్రదేశ్లో ఓ వ్యక్తి నిత్య పెళ్లికొడుకు అవతారం ఎత్తాడు. ఏకంగా 8 మంది ప్రభుత్వ మహిళా టీచర్లను పెళ్లి చేసుకుని మోసం చేశాడు. వారిలో ఎక్కువ మందిని భారీ మొత్తంలో బ్యాంకు రుణాలు తీసుకునేలా ప్రేరేపించి, ఆ డబ్బుతో పారిపోయాడు. ఈ క్రమంలో కోట్లాది రూపాయలు సంపాదించాడు.నిత్య పెళ్లి కొడుకు చేతిలో మోసపోయిన ఇద్దరు ప్రభుత్వ మహిళా టీచర్లు సోన్ భద్ర పోలీసులను శుక్రవారం ఆశ్రయించారు. రాజన్ గహ్లోత్ అనే వ్యక్తి తమను మోసం చేశాడని ఫిర్యాదు చేశారు. అతడిపై చర్యలు తీసుకోవాలని కోరారు. తమతో పాటు మరో ఆరుగురు ఇతర మహిళలను వివాహం చేసుకుని, వారి దగ్గర డబ్బుతో పారిపోయాడని మహిళలు ఆరోపించారు.2014లో ఆన్లైన్ వివాహ పోర్టల్ ద్వారా తనకు గహ్లోత్ పరిచయం అయ్యాడని అంబేద్కర్ నగర్కు చెందిన ఓ ప్రభుత్వ మహిళా ఉపాధ్యాయురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. గహ్లోత్ తనను తాను ప్రభుత్వ ఉద్యోగిగా పరిచయం చేసుకున్నాడని,ఆ తర్వాత ఇద్దరం వివాహం చేసుకున్నామని బాధితురాలు వెల్లడించింది. 2016లో కొంత భూమి కొని ఇల్లు కట్టుకుందామని నమ్మబలికి, రూ.40 లక్షల బ్యాంకు రుణం తీసుకోవాలని తనపై ఒత్తిడి చేశాడని ఆవేదన వ్యక్తం చేసింఇ.. లోన్ అమౌంట్ అందిన వెంటనే పరారయ్యాడని,ఇదంతా మోసమని గ్రహించి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశానని కన్నీటిపర్యంతమైంది.పోలీసులు నిత్యపెళ్లికొడుకు కోసం గాలిస్తున్నారు.
