40 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారు…
వైసీపీకి చెందిన 40 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు ఆత్మ ప్రబోధానుసారం ఓటు వేస్తే ఆగమేఘాలపై వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారన్నారు. ఏకంగా 40 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారని చెప్పారు. వారి గురించి తెలిస్తే సీఎం జగన్ పక్షవాతం వస్తుందంటూ ఆమె ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే శ్రీదేవి ఆవేదనతో మాట్లాడితే.. ఊసరవెల్లి శ్రీదేవి అంటే మంత్రి అమర్నాథ్ మాట్లాడడం దారుణమన్నారు. ఎంత డబ్బు ఇచ్చి జనసేన ఎమ్మెల్యే రాపాక వర ప్రసాదరావును వైసీపీలోకి తెచ్చకున్నారో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. సీఎం జగన్ గంజాయిను రాష్ట్ర పంటగా మార్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. తిరుమల కొండపై గంజాయి దొరకడం వైసీపీ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని వంగలపూడి అనిత పేర్కొన్నారు.