Andhra PradeshNews

పోలవరాన్ని ప్రశ్నిస్తే తెలంగాణ ఏర్పాటును ప్రశ్నించినట్లే..

Share with

ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పోలవరంపై కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరం అంశాన్ని వివాదం చేసే కుట్ర జరుగుతుందని ఆయన ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు గురించి టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారని, అసలు వాళ్లకి ప్రాజెక్టుతో ఏం పని అని ప్రశ్నించారు. వరప్రదాయిని అయిన పోలవరం ప్రాజెక్టును ప్రశ్నిస్తే తెలంగాణ ఏర్పాటును ప్రశ్నించినట్లేనని వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంతో రాష్ట్ర విభజన అంశాన్ని తిరగతోడినట్లేనని అభిప్రాయపడ్డారు.

రాష్ట్ర విభజన బిల్లు ప్రకారం పోలవరం నిర్మాణం చేయాలని…రాష్ట్ర విభజనపై పూర్తిగా అధ్యయనం చేసిన ఏకైక పార్టీ బీజేపీ అని పేర్కొన్నారు.1960లో పోలవరం ముంపు మండలాలను ఖమ్మంలో కలిపారని, విభజన తరవాత భద్రాచలం టెంపుల్ ను, మరో రెండు మండలాలు తెలంగాణ కు ఇచ్చారని సోము వీర్రాజు గుర్తుచేశారు. దుమ్మగూడెం ప్రాజెక్టు ద్వారా నాగార్జున సాగర్‌కు నీరు ఇవ్వాలని వైఎస్ పనులు చేపట్టారు.దుమ్ముగూడెం ప్రాజెక్టు తెలంగాణకు ఇవ్వడం వల్ల రాయలసీమ తీవ్రంగా నష్టపోయిందన్నారు. పోలవరం వద్దని నాడు టీడీపీ వరంగల్ మహిళా నేత మాట్లాడారు.నేడు మా పార్టీ లో ఉన్న ఇద్దరు నాయకులు అప్పుడు టీడీపీలో ఉన్నారు. వారిద్దరూ నాడు ఆమె వ్యాఖ్యలను కనీసం ఖండించలేదు. ఆ తరువాత చంద్రబాబు ‘పోలవరం సోమవారం’ అని ఆర్భాటం చేశారు. పోలవరంను వ్యతిరేకిస్తే.. విభజన చట్టాన్ని ఒప్పుకోనట్లే. అప్పుడొక మాట.. ఇప్పుడొక మాట అనేది కరెక్ట్ కాదన్నారు సోమువీర్రాజు. పోలవరం ముంపు ప్రాంతాల్లో కొన్ని గ్రామాల ప్రజలు తెలంగాణలో కలుస్తామంటున్నారు. వారంతా భద్రాచలం మీద ఆధార పడటంవల్ల అటు చూస్తున్నారు. విలీనం చేసిన మండలాల్లో‌ సీపీఎం ఆందోళన చేయడం ఏమిటి..? ఏం మాయ రోగం వచ్చింది.. టీఆర్ఎస్ పార్టీతో లాలూచి పడి రోడ్డెక్కారా..? వారికి అన్నీ తెలిసి కూడా ఇలా చేస్తారా..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు సోమువీర్రాజు.