‘వారు కూలీలు కాదు’..పవన్ కళ్యాణ్
‘కూలీ’ అనే పేరు బ్రిటిషర్స్ నుంచి వచ్చిందని.. గ్రామాభివృద్ధికి పాటు పడే ఉపాధి హామీ పథకం కింద పని చేసేవారు కూలీలు కాదన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మంగళగిరిలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు పవన్… పహల్గామ్ మృతులకు రెండు నిమిషాలు మౌనం పాటించారు. గ్రామాల్లో అభివృద్ధితోపాటు అవినీతిపైనా దృష్టి పెట్టాలని, గత ప్రభుత్వ హయాంలో.. గ్రామాల్లో అన్యాక్రాంతమైన భూముల లెక్కలు తేల్చాలన్నారు. పంచాయతీరాజ్ శాఖను ఇష్టంగా తీసుకున్నానని.. గ్రామాలు స్వయం ప్రతిపత్తి సంస్థలుగా ఎదగాలని ఆకాంక్షించారు.. పల్లెల్లో ఉండటమంటే ఇష్టమే కానీ కుదరలేదంటూ పేర్కొన్నారు. అధికారుల కృషితో గ్రామాల్లో వేగవంతమైన అభివృద్ధి సాగుతోందని.. గతంలో చాలా తండాల్లో పర్యటించానని, వాటన్నింటినీ అభివృద్ధి చేయాలని నిర్ణయించామన్నారు. ఈ రోజు మధ్యాహ్నం నెల్లూరు జిల్లా కావలికి వెళ్లనున్నారు. అక్కడ పహల్గాం ఉగ్ర దాడిలో మృతి చెందిన మధుసూదన్ రావు భౌతిక కాయానికి డిప్యూటీ సీఎం పవన్ నివాళులర్పించనున్నారు.