NewsTelangana

ఈటల ప్రకటనతో టీఆర్ఎస్‌ నేతలకు చలి జ్వరం

Share with

పలువురు మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు కేసీఆర్‌పై విశ్వాసం కోల్పోయారన్నారు హుజూరాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నేత ఈటల రాజేందర్. వారంతా కేసీఆర్‌తో ఇష్టంలేని కాపురం చేస్తున్నారని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నందున నియోజకవర్గాల్లో పనుల కోసం వారు టీఆర్ఎస్‌లో ఉన్నారన్నారు. చాలా మంది టీఆర్ఎస్ నేతలు బీజేపీతో టచ్‌లో ఉన్నారన్నారు. గజ్వేల్‌లో కేసీఆర్‌పై పోటీ చేయడం ఖాయమన్న ఈటల టీఆర్ఎస్ ఓడించే సత్తా బీజేపీకి మాత్రమే ఉందన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని బీజేపీలోకి ఆహ్వానిస్తున్నామన్నారు ఈటల. రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరతారనుకుంటున్నానని.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తమ పార్టీలోకి ఎవరొచ్చినా గెలిపించుకుంటామని చెప్పారు. ఈ నెల 27 తర్వాత చేరికలు ఉంటాయని ఈటల చెప్పుకొచ్చారు.

ఈటల కామెంట్స్‌తో టీఆర్ఎస్ ఆత్మరక్షణలో పడిందంటున్నారు విశ్లేషకులు. బడుగు బలహీనవర్గాల ఎమ్మెల్యేలతో ప్రెస్ మీట్ పెట్టి ఇష్టానుసారం వ్యాఖ్యలు చేయించడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు ఎక్స్‌పర్ట్స్. ఒకనాడు ఈటల చుట్టూ తిరిగిన నేతలు ఇప్పుడు రాజేందర్ పై చేస్తున్న విమర్శలు ఉద్యమ కాలాన్ని మించిపోయాయంటున్నారు. ఏకలింగం లాంటి వ్యక్తిని ఎమ్మెల్యేను, మంత్రిని చేస్తే వెన్నుపోటు పొడిచాడంటూ విమర్శించడమేంటని ప్రశ్నిస్తున్నారు. హుజూరాబాద్ లో ఈటెల ఓడిపోతాడనే… గజ్వేల్ లో పోటీ చేస్తానని కొత్త రాగం అందుకున్నారంటూ పెడబొబ్బలు పెడుతున్నారంటున్నారు. ఈటల లాంటి నేతలను విమర్శిస్తే పెద్దోళ్లమైపోతామన్న తరహాలో నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయ్.

తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్ర నేతలు ఎవరూ కూడా ఈటల రాజేందర్ ను దూషించలేదు. ఇప్పుడు టీఆర్ఎస్ నేతలు చేస్తున్న కామెంట్స్ తరహాలో అసలే మాట్లాడటం లేదు. కానీ ఇప్పుడు ఈటల ఒక్క ప్రకటనతో టీఆర్ఎస్ నేతలు చేస్తున్న కామెంట్స్ సామాన్య ప్రజలు చీదరించుకునేలా ఉన్నాయంటున్నారు నిపుణులు. గతంలో ఈటల వద్ద సాయం పొందిన నేతలు… రాజకీయంగా ఆయనతో కలిసి పనిచేసిన నేతలు ఇప్పుడు చేస్తున్న కామెంట్స్ వింటే… వీళ్లేందిరా బాబూ ఇలా మాట్లాడుతున్నారనుకునేలా ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయంటున్నారు. ముఖ్యంగా దళిత సామాజికవర్గానికి చెందిన బాల్క సుమన్, గువ్వల బాలరాజు లాంటి నేతలను ఇలా… ఈటలపై దాడికి టీఆర్ఎస్ ఉపయోగించడాన్ని సామాన్య ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు.