Andhra PradeshHome Page Slider

అమరావతి బీజేపీ అభ్యర్థిగా నవనీత్ రాణా ఎంపిక

Share with

ఢిల్లీ: మహారాష్ట్రలోని అమరావతి నుండి ప్రస్తుతం స్వతంత్ర ఎంపీగా ఉన్న సినీనటి నవనీత్ రాణాకు బీజేపీ లోక్‌సభ టిక్కెట్ ఇచ్చింది. ఆ రాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో తొలి నుండి పోరాడుతున్న ఆమెను బీజేపీ తమ పార్టీలో చేర్చుకుని సీటు కేటాయించింది. దీంతో బీజేపీ అభ్యర్థుల జాబితాలో ఉన్న హేమామాలిని, కంగనా రనౌత్, అరుణ్ గోవిల్‌లతో మరో నటి చేరినట్లయింది. కర్ణాటకలోని చిత్రదుర్గ ఎస్‌సీ రిజర్వుడు స్థానం నుండి ప్రస్తుత కేంద్ర సామాజిక న్యాయం, సాధికార శాఖ సహాయ మంత్రి ఎ.నారాయణస్వామిని తప్పించి కొత్తగా గోవింద్ కార్జోల్‌కు అవకాశం ఇచ్చింది. ఈయన ఇదివరకు కర్ణాటక మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రిగా, నీటి పారుదల శాఖ, ప్రజాపనులు, సామాజిక న్యాయం సాధికార శాఖ మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడిగాను పనిచేశారు. ఇప్పటివరకూ విడుదల చేసిన 7 జాబితాల ద్వారా బీజేపీ 407 మంది అభ్యర్థులను ప్రకటించింది.