గద్దర్ గురించి అలా మాట్లాడటం కరెక్ట్ కాదు – సీఎం రేవంత్
సమాజాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల మీద పోరాటాల కోసం లక్షలాది మంది యువతకు స్ఫూర్తినిచ్చిన గొప్ప సిద్దాంతకర్త గద్దర్ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో నిర్వహించిన గద్దర్ (గుమ్మడి విఠల్ రావు) 77వ జయంతి ఉత్సవాల్లో రేవంత్ ముఖ్యతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… నిరంతరం ప్రజల మధ్య ఉండి , తన గళం, కలంతో స్ఫూర్తినిచ్చి సామాజిక రుగ్మతలకు చికిత్స చేయాలని ప్రయత్నించారని కొనియాడారు.తెలంగాణ సమాజానికి ఒక గొప్ప స్ఫూర్తిని అందించి ఆదర్శంగా నిలబడిన వ్యక్తులకు పద్మభూషణ్, పద్మశ్రీ పురస్కారాలను ఇవ్వాలని కొందరి పేర్లు ప్రతిపాదిస్తే ఇవ్వలేదని కేంద్రంపై ఆరోపణలు చేశారు. తాము ప్రతిపాదించిన వారు ఈ సమాజానికి ఆదర్శంగా లేరా? అని రేంత్ సూటిగా ప్రశ్నించారు. ప్రధానమంత్రికి తమ ఆలోచనను, తమ బాధను, తమ నిరసనను తెలియజేస్తూ లేఖ రాస్తున్నట్టుగా ఒక వేదిక నుంచి చెప్పానన్నారు. జరిగిన తప్పును సవరించుకొని భవిష్యత్తులోనైనా సరిదిద్దుకుంటారని భావిస్తున్నామన్నారు. దురదృష్టవశాత్తు కేంద్రంలో మంత్రిగా ఉన్న వారే గద్దరన్నకు పురస్కారం ఇవ్వమని, గౌరవించమని మాట్లాడటం సరికాదు” అని బండి సంజయ్ని ఉద్దేశ్యించి వ్యాఖ్యానించారు.

