ఏపీలో ఏసీబీ భయంతో ఆఫీసుకు రాని ఉద్యోగులు
ఏపీలో నిన్నటి నుండి పలు ప్రభుత్వ కార్యాలయాలలో ఏసీబీ దాడులు జరుగుతున్నాయి. ఏసీబీ టోల్ ఫ్రీ నెంబరు 14400 కు వచ్చిన అనేక ఫిర్యాదుల కారణంగా ఈ దాడులు నిర్వహిస్తున్నట్లు ఏసీబీ డైరక్టర్ జనరల్ రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి చాలా ఫిర్యాదులు రావడంతో స్పందించిన ఏసీబీ బుధవారం ఏపీ వ్యాప్తంగా ఆఫీసులలో దాడులు, తనిఖీలు మొదలుపెట్టింది. తహసీల్దార్ ఆఫీసులలో, మండల కార్యాలయాలలో, సబ్ రిజిస్టార్ కార్యాలయాలలో పలువురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు అధికారులు. తిరుపతి, బద్వేలు, అనంతపురం,తుని, నర్సీపట్నం, కందుకూరు ,శ్రీకాకుళం, గుంటూరు మొదలైన నగరాలలో ఈ సోదాలు జరిగాయి. ఈ సోదాలలో లెక్కల్లో లేని లక్షల కొలది నగదును స్వాధీనం చేసుకున్నారు.పలువురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు అధికారులు. ఈ రోజు కూడా ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఏసీబీ ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక, దాడులు తట్టుకోలేక సిబ్బంది లీవులు పెట్టేశారు. దీనితో కార్యాలయాలలో సిబ్బంది భారీగా గైర్హాజరయ్యారు.