బాంబు పేలుడులో డిప్యూటీ గవర్నర్ మృతి
ఆఫ్గనిస్థాన్లో మంగళవారం బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుడులో డిప్యూటీ గవర్నర్ మృతి చెందారు. ఉత్తర బదక్షన్ ప్రావిన్స్ డిప్యూటీ గవర్నర్ నాసిర్ అహ్మద్ అహ్మది కారు బాంబు దాడిలో మరణించినట్లు ప్రావిన్షియల్ అధికార ప్రతినిధి తెలిపారు. ఈ ఘటనలో నాసిర్ అహ్మద్ అహ్మదితోపాటు ఆయన కారు డ్రైవర్ కూడా మృతి చెందాడు. మరో ఆరుగురు గాయపడ్డారు. ఈ దాడి వెనుక ఎవరున్నారో స్పష్టంగా తెలియలేదు. ఆత్మాహుతి దాడికి పాల్పడిన వ్యక్తి ఓ కారులో పేలుడు పదార్థాలను నింపుకొని అహ్మది ప్రయాణిస్తున్న కారు సమీపంలోకి దూసుకు వచ్చి పేల్చేసుకున్నాడు. సాంస్కృతిక, సమాచార విభాగానికి అహ్మది అధిపతిగా కూడా వ్యవహరిస్తున్నారు.