ఉగ్రవాదుల కాల్పుల్లో ఏపీ జవాన్ మృతి
జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదుల కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన జవాన్ మృతి చెందాడు. సోమవారం ఉగ్రవాదులకు, జవాన్లకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ జవాను చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందాడు. ఉగ్రవాదుల కదలికలపై సమాచారంతో సోమవారం నార్త్ జమ్మూకశ్మీర్ లో భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలోనే ఉగ్రవాదులకు, జవాన్లకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఏపీకి చెందిన జవాను పంగల కార్తీక్ కు బుల్లెట్ గాయాలయ్యాయి. గాయపడ్డ కార్తీక్ ను తోటి సైనికులు హుటాహుటిన ఆర్మీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. అయితే.. చిత్తూరు జిల్లాలోని బంగారు పాల్యం మండలం రాగి మానుపెంట గ్రామానికి చెందిన పంగల కార్తీక్ 2017లో ఆర్మీలో చేరారు. కార్తీక్ మరణ వార్తతో రాగి మానుపెంట గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కార్తీక్ ఇటీవల దీపావళి పండుగకు ఇంటికి వచ్చి వారం రోజుల పాటు ఊరిలో సరదాగా గడిపారు. తిరిగి మే నెలలో ఇంటికి వస్తానని చెప్పి కార్తీక్ ఆర్మీ టీంలోకి వెళ్లారని గ్రామస్థులు తెలిపారు.

