హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే నగర బహిష్కరణ శిక్ష: రేవంత్ రెడ్డి
బైరామల్ గూడ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఎల్బీ నగర్కు ఎప్పుడొచ్చినా గుండె వేగం పెరుగుతుందన్నారు. నాకు అండగా ఉండే వారంతా ఈ ప్రాంతంలో ఉన్నారు… మీ అభిమానం ఎప్పటికీ మరిచిపోలేనిదన్నారు. దేశానికే ఆదర్శంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నగరాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ఉప్పల్, నాగోల్, ఎల్బీ నగర్, హయత్ నగర్, ఓవైసీ హాస్పిటల్, చాంద్రాయణగుట్ట, మైలార్ దేవర్ పల్లి మీదుగా మెట్రో రైలు నిర్మించాల్సిన బాధ్యత మాపై ఉందన్నారు. మురికి కూపంగా మారిన మూసీ పరివాహక ప్రాంతాన్ని రూ.40 నుంచి 50 వేల కోట్లతో అభివృద్ధి చేయబోతున్నామన్నారు. లండన్ థెమ్స్ నదీపరివాహక ప్రాంతంలా మూసీ నదీ పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. వైబ్రాంట్ తెలంగాణ 2050లో భాగంగా త్వరలోనే 55 కి.మీ మేర మూసీ పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామన్నారు.

ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న నగరాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నామన్నారు రేవంత్ రెడ్డి. 354 కి.మీ ల రీజనల్ రింగ్ రోడ్డు పరిధిలోపల సబర్బన్ హైదరాబాద్ కింద రేడియల్ రోడ్లు నిర్మించి అభివృద్ధి చేస్తామన్నారు. అందరి సలహాలు, సూచనలతో వైబ్రాంట్ తెలంగాణ 2050 మెగా మాస్టర్ ప్లాన్ తీసుకురాబోతున్నామన్నారు. హైదరాబాద్లో మెట్రో విస్తరణ అడ్డుకోవాలని చూసేవారిని ఈ వేదికగా హెచ్చరిస్తున్నానంటూ రేవంత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ నగర అభివృద్ధికి అడ్డు పడొద్దు, హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకోవాలని చూసే వారికి నగర బహిష్కరణ శిక్ష విధించాల్సి ఉంటుందన్నారు.