అమెరికాలో HLPF వేదికపై కిషన్రెడ్డికి అరుదైన గౌరవం
అమెరికాలోని న్యూయార్క్లో హైలెవెల్ పొలిటికల్ ఫోరమ్ (HLPF) వేదికలో ప్రసంగించే తొలి భారత పర్యాటక మంత్రిగా కిషన్ రెడ్డికి అరుదైన గౌరవం దక్కబోతోంది. జీ 20 టూరిజం చైర్ పర్సన్ హోదాలో ఈ సమావేశానికి హాజరుకానున్నారు కిషన్ రెడ్డి. శుక్రవారం జరుగబోయే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు కిషన్ రెడ్డి నిన్ననే దిల్లీ నుండి అమెరికా బయలుదేరి వెళ్లారు. అమెరికా కాలమానం ప్రకారం.. 14వ తేదీ మధ్యాహ్నం 1.15 నుంచి UNWTO (ఐక్యరాజ్యసమితి ప్రపంచ పర్యాటక సంస్థ) ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ HLPF సమావేశాల్లో ఆయన పాల్గొంటారు. ఈ నేపథ్యంలో ‘పర్యాటక రంగంలో సుస్థిరాభివృద్ధి లక్షాలను చేరుకోవడం; అత్యవసర కార్యాచరణ కోసం దేశాలను, వివిధ భాగస్వామ్య పక్షాలను (వ్యాపార సంస్థలు) ఏకం చేయాల్సిన ఆవశ్యకత’ థీమ్ తో ఈ సమావేశాలు జరుగుతున్నాయి. ఇందులో ప్రపంచంలోని వివిధ దేశాల ప్రతినిధులు, బడా పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి కిషన్రెడ్డి ప్రసంగించనున్నారు.

ఈపర్యటన సందర్భంగా 14, 15 తేదీల్లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. పలు చారిత్రక మ్యూజియంలను సందర్శించనున్నారు. పలు పర్యాటక రంగ సంస్థల ప్రతినిధులతో చర్చించనున్నారు. భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అమెరికాలో ఉంటున్న భారత సంతతి ప్రజలు, ప్రముఖులతో నిర్వహిస్తున్న సమావేశంలో పాల్గొని, ప్రసంగిస్తారు. అనంతరం ‘ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ’ సమావేశంలో కూడా పాల్గొననున్నారు. అక్కడినుంచి లండన్ బయలుదేరి వెళ్లనున్న కేంద్రమంత్రి.. అక్కడినుంచి 19వ తేదీ ఉదయం ఢిల్లీ చేరుకోనున్నారు. ఇటీవలే గోవాలో జరిగిన జీ-20 దేశాల పర్యాటక మంత్రుల సమావేశాలు విజయవంతంగా జరగడం, ‘గోవా రోడ్మ్యాప్’ రూపంలో భారతదేశం చేసిన ప్రతిపాదనలకు సభ్యదేశాలు, ఆతిథ్యదేశాలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.