Andhra PradeshHome Page Slider

అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాలు

గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల పేదలకు ప్రభుత్వం శుభవార్త

సీఎం అధ్యక్షతన జరిగిన 33వ సీఆర్డీయే అథారిటీ సమావేశంలో ఆమోదం

అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు అడ్డంకులు ఒక్కొక్కటిగా తొలుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం నుంచి మరో ముందడుగు పడింది. గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో ఇళ్లులేనివారికి అమరావతిలో ఇంటిపట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. సోమవారం సీఎం జగన్‌ అధ్యక్షతన జరిగిన 33వ సీఆర్డీయే అథారిటీ సమావేశంలో ఈ మేర‌కు ఆమోదం ల‌భించింది. న్యాయపరమైన చిక్కులు వీడిన తర్వాత పేదలకు ఇళ్లస్థలాలు ద‌క్క‌నున్నాయి. అమరావతిలో పేలందరికీ ఇళ్లు కార్యక్రమం కోసం ఇళ్లస్థలాలు కేటాయిస్తూ ప్ర‌భుత్వం జీవో జారీ చేసింది. అమరావతిలో 1134.58 ఎకరాల భూమి పేదల ఇళ్ల కోసం కేటాయించారు. మొత్తం 20 లే అవుట్లలో ఇళ్ల స్థలాలు ఇవ్వ‌నున్నారు. గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన 48,218 మందికి ఇళ్లపట్టాలు అంద‌నున్నాయి. ఐనవోలు, మందడం, కృష్ణాయపాలెం, నవులూరు, కూరగల్లు, నిడమానూరు ప్రాంతాల్లో ఇళ్లస్థలాలు ఇచ్చేందుకు ప్ర‌ణాళిక సిద్ధం చేస్తున్నారు. నవరత్నాలు, పేదలందరికీ ఇళ్లు కింద ప్ర‌భుత్వం ఇళ్లపట్టాలు ఇవ్వనుంది. లబ్ధిదారుల జాబితాతో డీపీఆర్‌లు తయారు చేయాలని గుంటూరు, ఎన్టీఆర్‌ జిల్లాల కలెక్టర్లకు సీఎం జ‌గ‌న్ ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రతిపాదనలను సీఆర్డీయేకు అప్పగించాలని ఆదేశించారు.

నవరత్నాలు… పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం మూడోవిడత కింద వీరికి ఇళ్లపట్టాలు ఇవ్వాలని సీఎం ఆదేశించారు. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన కనీస మౌలిక సదుపాయాలను వెంటనే కల్పించేలా తగిన కార్యాచరణ రూపొందించుకోవాలని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ అధికారుల‌ను ఆదేశించారు. మే నెల మొదటివారం నాటికి.. పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇళ్లులేని పేదల చిరకాల వాంఛ నెరవేర్చే ఈ కార్యక్రమాన్ని వేగవంతంగా ముందుకు తీసుకెళ్లాలని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నిర్ణ‌యంతో గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లోని పేద‌లు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్నారు. ఎన్నో ఏళ్ల నాటి ఇంటి క‌ల నెర‌వేర‌బోతుంద‌ని ల‌బ్ధిదారులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.