వివేక హత్య కేసు నిందితుడు సునీల్ యాదవ్కు బెయిల్ తిరస్కృతి
ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడు సునీల్ యాదవ్ కు బెయిల్ ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. ఆయన బెయిల్ పిటిషన్ సోమవారం కోర్టు కొట్టి వేసింది. సిబిఐ దర్యాప్తు కొనసాగుతున్నందున ఈ దశలో బెయిల్ ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రస్తుతం జైల్లో ఉన్న సునీల్ యాదవ్ తనకు బెయిల్ మంజూరు చేయాలను కోరుతూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఆర్టికల్ 21 ప్రకారం సునీల్ యాదవ్ వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తున్నారని ఈ కేసులో ఇప్పటికే చార్జిషీట్ దాఖలైన దృష్ట్యా అతన్ని అరెస్టు చేసి జైల్లో ఉంచాల్సిన అవసరం లేదని సునీల్ తరపు న్యాయవాది తన వాదనను వినిపించారు. ఈ కేసు విచారణలో సునీల్ సిబిఐ అధికారులకు పూర్తిస్థాయిలో సహకరించారని ఈ కేస్ తో ఆయనకు ఎలాంటి సంబంధం లేదని న్యాయవాదులు న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. అయితే ఈ బెయిల్ పిటిషన్ ను సిబిఐ వ్యతిరేకించింది. ప్రస్తుతం వివేకానంద రెడ్డి హత్య కేసు కీలక దశలో ఉందని ఈ దశలో నిందితులకు బెయిల్ ఇవ్వటం సరికాదని కోర్టు దృష్టికి తెచ్చింది. ఇప్పుడు నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని సిబిఐ వాదించింది. వివేకా హత్యలో రాజకీయ పెద్దల ప్రమేయంపై దర్యాప్తు కొనసాగుతుందని కోర్టు దృష్టికి తీసుకువచ్చింది. అలాగే ఈ కేసులో నిందితుడు బైలుకి వ్యతిరేకంగా వైఎస్ సౌభాగ్యమ్మ, సునీత తరఫున న్యాయవాదులు కూడా ఈ అంశంలో వాదించారు. వీళ్లంతా సునీల్ యాదవ్ కు బెయిల్ ఇవ్వ వద్దని కోరారు. దీనిపై స్పందించిన కోర్టు సిబిఐ వాదనలతో ఏకీభవించింది. నిందితుల వ్యక్తిగత స్వేచ్ఛ కన్నా సాక్షుల భద్రత పారదర్శక దర్యాప్తు ముఖ్యమని హైకోర్టు అభిప్రాయపడింది. దీంతో సునీల్ యాదవ్ కు బెయిల్ నిరాకరిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది.