Home Page SliderNational

సిసోడియా అరెస్టుపై భగ్గుమన్న కేజ్రీవాల్… డర్టీ పాలిటిక్స్ అంటూ మండిపాటు

డిప్యూటీ మనీష్ సిసోడియా అరెస్టును “డర్టీ పాలిటిక్స్” అని పిలిచారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. “ప్రజలు అందుకు సమాధానం ఇస్తారు” అని హెచ్చరించారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఈరోజు ఎనిమిది గంటల పాటు ప్రశ్నించిన తర్వాత ఢిల్లీ ఆర్థిక మంత్రి సిసోడియాను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, సీబీఐ అరెస్టు చేసింది. “మనీష్ నిర్దోషి. అరెస్టు నీచ రాజకీయం. సిసోడియా అరెస్ట్ కారణంగా ప్రజల్లో చాలా కోపం ఉంది. అందరూ చూస్తున్నారు. ప్రజలు ప్రతిదీ అర్థం చేసుకున్నారు. ప్రజలు దీనికి స్పందిస్తారు. ఇది మా స్ఫూర్తిని మరింత పెంచుతుంది. మా పోరాటం. మరింత బలపడుతుంది’ అని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.

దేశ రాజధానిలో కొత్త మద్యం విక్రయ విధానాన్ని తీసుకురావడంలో సిసోడియా, ఇతరులు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా గతేడాది సీబీఐ విచారణకు ఆదేశించారు. ఢిల్లీ ప్రభుత్వం మళ్లీ పాత మద్యం పాలసీని అనుసరించి, కోట్లాది రూపాయల ఆదాయాన్ని కోల్పోయిందని లెఫ్టినెంట్ గవర్నర్ రిపోర్ట్ ఇచ్చారు. సిసోడియా ఆధీనంలో ఉన్న ఎక్సైజ్ శాఖలో అవినీతిని కప్పిపుచ్చేందుకు ఢిల్లీ ప్రభుత్వం పాత మద్యం విక్రయ విధానానికి తిరిగి వెళ్లిందని బీజేపీ పేర్కొంది.
సిసోడియా విచారణకు సహకరించడం లేదని సీబీఐ పేర్కొంది. అయితే, కేజ్రీవాల్, సిసోడియా ఎదుగుదలకు బీజేపీ “భయపడుతోంది” అని ఆప్ ఎమ్మెల్యే అతిషి అన్నారు. “ఆప్‌కి పెరుగుతున్న ప్రజాదరణ ఈ అరెస్టు వెనుక కారణం. బీజేపీ ఆప్‌ను అంతం చేయడానికి ప్రయత్నిస్తోంది. ఇది తప్పుడు కేసు” అని అతిషి ఢిల్లీలో ఆరోపించారు.