Home Page SliderNationalPolitics

తమిళనాడులో వేడిక్కిన రాజకీయాలు… గెటవుట్‌ రవి పోస్టర్ల కలకలం

తమిళనాడు అసెంబ్లీలో గవర్నర్‌ వర్సెస్‌ అధికార పార్టీ డీఎంకే మధ్య వివాదం తారాస్థాయికి చేరింది. అసెంబ్లీలో గవర్నర్‌ ఆర్‌.ఎన్‌.రవి చేసిన ప్రసంగం మరింత వేడి రాజేసింది. గవర్నర్‌ రవికి వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. గెటవుట్‌ రవి అంటూ డీఎంకే నేతలు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పోస్టర్లు అతికించారు. సోమవారం అసెంబ్లీలో గవర్నర్‌ తీరును తప్పుబట్టారు. రాష్ట్రాన్ని, ప్రభుత్వాన్ని అవమానించేలా ప్రవర్తిస్తున్నారని అధికారంలోని డీఎంకే నేతలు ఆరోపించారు. సోషల్‌ మీడియాలో ఇదే స్లోగన్‌తో హ్యాష్‌ట్యాగ్‌ క్రియేట్‌ చేసి ట్రెండ్‌ సృష్టిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రసంగాన్ని మాత్రమే స్పీకర్‌ రికార్డ్‌ చేయాలని, గవర్నర్‌ జోడించిన, దాటవేయబడిన భాగాలను తొలగించాలని కోరుతూ సీఎం స్టాలిన్‌ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన తరువాత అసెంబ్లీ నుంచి గవర్నర్‌ ఆర్‌.ఎన్‌ రవి వాకౌట్‌ చేశారు. అయితే..  ఈ ఘటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

తమిళనాడును శాంతిస్వర్గంగా అభివర్ణిస్తూ లౌకికవాదం, పెరియార్‌, బీఆర్‌ అంబేద్కర్‌, కే. కామరాజ్‌, సీఎస్‌ అన్నాదురై, కరుణానిధి వంటి నేతల ప్రస్తావనలతో రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రసంగంలో కొన్ని భాగాలను గవర్నర్‌ చదవకుండా దాటవేశారని సీఎం తీర్మానంలో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే అధికార డీఎంకే ప్రచారం చేస్తున్న ద్రావిడ మోడల్‌ ప్రస్తావన కూడా గవర్నర్‌ చదవలేదని, గవర్నర్‌ చర్య అసెంబ్లీ సంప్రదాయాలకు విరుద్ధమని తీర్మానంలో స్టాలిన్‌ పేర్కొన్నారు. అధికార డీఎంకే మిత్ర పక్షాలు, కాంగ్రెస్‌, విడుతలై చిరుతైగల్‌ కట్చి, సీపీఐ, సీపీఎం లాంటి పార్టీలు గవర్నర్‌ ప్రసంగాన్ని బహిష్కరించాయి. అసెంబ్లీలో ఆమోదం పొందిన 21 బిల్లులు గవర్నర్‌ వద్ద పెండింగ్‌లో ఉన్నట్లు డీఎంకే మిత్రపక్షాలు ఆరోపించాయి. గవర్నర్‌కు వ్యతిరేకంగా అసెంబ్లీలో నినాదాలు హోరెత్తాయి.