Home Page SliderNationalNews Alert

రిషబ్‌ కారు ప్రమాదంపై కపిల్‌ దేవ్‌ కీలక వ్యాఖ్యలు

ప్రముఖ క్రికెటర్‌ రిషబ్‌ పంత్‌ కారు ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఉత్తరాఖండ్‌లోని రూర్కీకి వెళుతుండగా కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొనడం, వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.. ఓ బస్సు డ్రైవర్‌ పంత్‌ను కాపాడాడు. ప్రస్తుతం డెహ్రాదూన్‌లోని ఓ ఆసుపత్రిలో పంత్‌ ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నాడు. అయితే.. మాజీ క్రికెటర్‌ కపిల్‌ దేవ్‌ ఈ ప్రమాదంపై కీలక వ్యాఖ్యలు చేశారు. రిషబ్‌ను ఉద్దేశిస్తూ.. ఓ డ్రైవర్‌ను నియమించుకోవడం నీకు భారం కాదు. నీవు సొంతంగా కారును నడపకూడదు. ఎవరికైనా ఈ తరహా కోరికలు ఉంటాయని నేను అర్థం చేసుకోగలను. ఆ వయసులో ఉన్న వారికి ఇలాంటి కోరికలు ఉండడం సహజమే. కానీ, నీకంటూ బాధ్యతలు ఉన్నాయి. నీ గురించి నీవే జాగ్రత్తలు తీసుకోగలవు. నీ గురించి నీవు నిర్ణయం తీసుకోవాలని కపిల్‌ దేవ్‌ అభివర్ణించారు. ఈ ప్రమాదాన్ని ఓ గుణపాఠంగా  తీసుకోవాలన్నారు. తను కూడా కెరీర్‌ మొదట్లో మోటారు సైకిల్‌ ప్రమాదానికి గురయ్యాననన్నారు. ఆ రోజు నుంచి తన సోదరుడు ఆయనని మోటారు బైక్‌ను ముట్టనివ్వలేదని చెప్పారు. రిషబ్‌ పంత్‌ క్షేమంగా బయటపడినందుకు దేవుడికి ధన్యవాదాలు తెలిపారు.