కేసీఆర్ మాట తప్పారంటున్న బండి సంజయ్
తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు రోజురోజుకి హీటెక్కుతున్నాయి. మునుగోడు ఉపఎన్నిక అటు టీఆర్ఎస్కు,బీజేపీకి మధ్య యుద్దవాతావరణాన్ని సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ బీహార్ పర్యటన, దేశ రాజకీయాలలో సంచలనంగా మారింది. దీంతో బీజేపీ , టీఆర్ఎస్ మంత్రులు వరుసగా రాష్ట్ర పర్యటనలు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి సీఎం కేసీఆర్పై విరుచుకు పడ్డారు.

సీఎం కేసీఆర్ MIM భయంతోనే తెలంగాణ విమోచన దినాన్ని జరపడం లేదన్నారు. కేసీఆర్ తాను ఇచ్చిన మాటతప్పి, తెలంగాణ అమరులను అవమానిస్తున్నారన్నారు. రాష్ట్రంలో విలీన వజ్రోత్సవాల పేరిట సీఎం మరో జిమ్మిక్కుకు తెరలేపారని ఆయన ఆరోపించారు. తెలంగాణాలో బీజేపీ అధికారంలోకి వస్తే, తెలంగాణ విమోచన దినాన్ని తప్పకుండా నిర్వహిస్తామని బండి సంజయ్ వెల్లడించారు. ఈ మేరకు రాష్ట్రంలో అధికార ,ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.

