బెంగళూరులో తొలి ఏఐ యూనివర్సిటీ
కర్ణాటక ప్రభుత్వం రాష్ట్రాన్ని ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) విద్య, పరిశోధన, ఆవిష్కరణల కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. 6వ తరగతి నుంచే విద్యార్థులకు ఏఐ విద్యను పరిచయం చేయడంతో పాటు, బెంగళూరులో దేశంలోనే ప్రభుత్వ ఆధ్వర్యంలోని తొలి ఏఐ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వెల్లడించారు.
ఏఐ, ఎమర్జింగ్ టెక్నాలజీల్లో నైపుణ్యం కలిగిన నిపుణులను తయారు చేయడమే ఈ యూనివర్సిటీ ప్రధాన లక్ష్యమని తెలిపారు. అలాగే విద్యాసంస్థలు, స్టార్టప్లు, పరిశ్రమల మధ్య పరిశోధన, ఆవిష్కరణలకు ప్రోత్సాహం కల్పించేలా ప్రత్యేక ఏఐ హబ్ను కూడా ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.
విద్యార్థులకు చిన్న వయసు నుంచే ఏఐపై అవగాహన కల్పించి, భవిష్యత్ సాంకేతిక రంగ అవసరాలకు సిద్ధం చేయడమే ప్రభుత్వ ఉద్దేశమని పేర్కొన్నారు. అదనంగా, ఏఐ పరిశోధన, క్లౌడ్ కంప్యూటింగ్, భారీ స్థాయి డేటా ప్రాసెసింగ్కు అవసరమైన మౌలిక సదుపాయాల కోసం రెండు హైపర్స్కేల్ గ్రీన్ డేటా సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. అయితే ఏఐ పాఠ్యప్రణాళిక, యూనివర్సిటీ ప్రవేశాలు, అమలు కాలక్రమంపై ప్రభుత్వం ఇంకా అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.

