ఐపీఎల్ ఫ్రాంచైజీలకు బీసీసీఐ సీరియస్ వార్నింగ్!
ఐపీఎల్ 2026 సీజన్లో ప్రోటోకాల్ ఉల్లంఘనలపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫ్రాంచైజీ యజమానులు, సిబ్బంది ప్రవర్తనపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో బోర్డు కార్యదర్శి దేవజిత్ సైకియా 10 ఫ్రాంచైజీలకు కఠిన హెచ్చరికలు జారీ చేశారు. మ్యాచ్ సమయంలో యజమానులు డగౌట్ కు దూరంగా ఉండాలి. నిబంధనలు అతిక్రమించి ఆటగాళ్లతో మాట్లాడినా, మైదానంలోకి మొబైల్ ఫోన్లు తెచ్చినా కఠిన చర్యలు తప్పవు. ఆటగాళ్ల హోటల్ గదుల్లోకి అనధికార వ్యక్తుల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధించారు. ఎవరైనా కలవాలంటే జట్టు మేనేజర్ నుండి లిఖితపూర్వక అనుమతి తప్పనిసరి. అవినీతి నిరోధక విభాగం (ACU) ఫిర్యాదుల మేరకు ఈ కొత్త నిబంధనలను తక్షణమే అమలులోకి తెచ్చారు. నిబంధనలు పదేపదే ఉల్లంఘిస్తే ఫ్రాంచైజీలపై భారీ జరిమానాలు లేదా క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని బీసీసీఐ స్పష్టం చేసింది.

