ప్రభుత్వాలు మారిన ఉప్పల్ ప్రజల తిప్పలు తీరడం లేదు
ఉప్పల్ ఫ్లై ఓవర్ నిర్మాణం ఎనిమిది సంవత్సరాలుగా కొనసాగుతోందని, ప్రభుత్వాలు మారుతున్నా ఉప్పల్ ప్రజల పరిస్థితి మారటం లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల విమర్శించారు . ఉప్పల్ ఫ్లై ఓవర్ నిర్మాణ పనులను కవిత గురువారం పరిశీలించారు . నిర్మాణ పనుల ఆలస్యానికి గల కారణాలను అధికారులను అడిగి ఆమె తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తాను శాసన మండలిలో ఈ అంశాన్ని ప్రశ్నించినప్పుడు మంత్రి కోమటి రెడ్డి స్పందించి, త్వరలోనే సమీక్ష చేసి పూర్తి చేస్తామని హామీ ఇచ్చినా, ఆ తర్వాత కాంట్రాక్టర్ను మార్చారో లేదో తెలియదు కానీ, “ఎక్కడి గొంగళి అక్కడే” అన్నట్లుగా పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. జాగృతి జనం బాటలో భాగంగా ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి వచ్చామని, ఘట్కేసర్ వరకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఉండేందుకు నిర్మిస్తున్న ఈ ఫ్లై ఓవర్ 8 ఏళ్లుగా కడుతున్నారంటే ప్రజల పట్ల ప్రభుత్వాల చిత్తశుద్ధి ఏమాత్రం ఉందో తెలుస్తోందని అన్నారు. ఈ ఆలస్యానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం లోపమే కారణమని పేర్కొన్నారు . కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పనులు పూర్తి చేయించాలని కోరారు. అలాగే, ఈ ప్రాంత ఎంపీ ఈటల రాజేందర్, స్థానిక ఎమ్మెల్యే కూడా ఇక్కడికి వచ్చి నిరసన తెలిపి, పనులను త్వరితగతిన పూర్తి చేయాలనీ డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనులు పూర్తి చేయాలని, లేదంటే తమ సంస్థ తరఫున తామే ప్రభుత్వం వెంట పడి పనులు చేయిస్తామని కవిత అన్నారు .

