కేసీఆర్ మాజీ ఓఎస్డీకి సిట్ షాక్
తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు వేగవంతమయ్యిది . ఈ కేసు విచారణలో భాగంగా ప్రత్యేక దర్యాప్తు బృందం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసిన రాజశేఖర్ రెడ్డిని గురువారం ప్రశ్నించింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సుమారు రెండు గంటలపాటు సాగిన ఈ విచారణలో కీలక సమాచారం బయటపడినట్లు సమాచారం.
హైదరాబాద్ నూతన పోలీస్ కమిషనర్గా సజ్జనార్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ కేసుపై ప్రత్యేక దృష్టి సారించారు. ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి, దర్యాప్తును త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ పాలనలో కీలక పాత్ర పోషించిన రాజశేఖర్ రెడ్డిని సిట్ విచారణకు పిలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ విభాగం ద్వారా రాజకీయ ప్రత్యర్థులు, వ్యాపారవేత్తలు, మీడియా ప్రతినిధుల ఫోన్లు అక్రమంగా ట్యాప్ చేశారన్న ఆరోపణలు ప్రధానాంశంగా మారాయి. ఈ కేసులో ఇప్పటికే పలువురు పోలీసు అధికారులను సస్పెండ్ చేయగా, కీలక నిందితుడిగా ఉన్న మాజీ అధికారి రాధాకిషన్ రావును అరెస్టు చేశారు. ‘బీఆర్ఎస్ సుప్రీం’ ఆదేశాల మేరకే తాము పనిచేశామని రాధాకిషన్ రావు తన రిమాండ్ రిపోర్టులో పేర్కొనడం సంచలనం రేపింది.
రాజశేఖర్ రెడ్డి సమగ్రంగా ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ కేసులో మరికొందరు ప్రముఖులను సిట్ విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దర్యాప్తు తెలంగాణ రాజకీయాల్లో మరిన్ని పరిణామాలకు దారితీయవచ్చన్న ఆసక్తి పెరిగింది.

